నెట్వర్క్, వెలుగు: తెలంగాణ ఆడబిడ్డలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ చీరలతో సారె పెట్టి ప్రజా ప్రభుత్వం మహిళలను గౌరవిస్తోందని కలెక్టర్, పలువురు ఎమ్మెల్యేలు అన్నారు. ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలుచోట్ల మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఖమ్మం రూరల్ మండలం బైపాస్ రోడ్ లో టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో పాలేరు నియోజకవర్గం నాలుగు మండలాల సహాయ సంఘాల మహిళలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయం ఇన్ చార్జ్ తుంబూరి దయాకర్ రెడ్డి తో కలిసి కలెక్డర్ అనుదీప్ దురిశెట్టి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మొదటి విడత గ్రామీణ ప్రాంతాలలో ప్రారంభించామని తెలిపారు. 18 ఏండ్లు నిండిన ప్రతీ మహిళకు ఇందిరమ్మ చీర అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు.
భద్రాచలంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కారేపల్లిలో మండలంలోని పోలంపల్లి, భాగ్యనగర్ తండాల్లో ఎమ్మెల్యే రాందాస్ నాయక్, టేకులపల్లి మండల కేంద్రంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక,కరకగూడెం మండలాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట, మూలకలపల్లిలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ స్వయం సహాయక సంఘాల మహిళలకు చీరలు పంపిణీ చేశారు. మహిళల కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించారు.
