భారత్కు జీ20 సారథ్య బాధ్యతలు 

భారత్కు జీ20 సారథ్య బాధ్యతలు 

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జీ20 దేశాల కూటమికి ఇక భారత్ నేతృత్వం వహించనుంది. బుధవారం ఇండోనేషియాలోని బాలి నగరం వేదికగా ఇందుకు సంబంధించిన కీలక ఘట్టం చోటుచేసుకుంది. జీ20 సారథ్య బాధ్యతల బదలాయింపునకు సూచికగా ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో  కర్ర సుత్తెను ప్రధాని మోడీ చేతికి అందించి అభినందనలు తెలిపారు. జీ20 సారథ్య బాధ్యతలు భారత్ కు దక్కడం ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. 

అంతకుముందు జీ20 సదస్సులో రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై ప్రధాన చర్చ జరిగింది. ఐరోపా దేశం పోలాండ్ లో జరిగిన మిస్సైల్ దాడిలో ఇద్దరు మృతిచెందిన ఘటనపైనా చర్చ జరిగింది. మిస్సైల్ దాడి చేసింది రష్యానే అని.. ఆ మిస్సైల్ రష్యాలో తయారైందేనని పోలాండ్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కేంద్రంగా ఈ చర్చ సాగింది. 

మరోవైపు జీ20 వేదికగా వివిధ దేశాల అధినేతలతోనూ ప్రధాని మోడీ భేటీ అయ్యారు. మోడీ కలిసిన దేశాధినేతల జాబితాలో చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ కూడా ఉన్నారు. గల్వాన్ లోయ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఆ ఘటన తర్వాత భారత  ప్రధాని, చైనా అధ్యక్షుడు కలవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే ఈసారి జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గైర్హాజరయ్యారు.