జకర్తా: ఇండోనేసియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–1000 టోర్నీలో ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మెన్స్ సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్, హెచ్.ఎస్. ప్రణయ్ క్వార్టర్ఫైనల్లోకి దూసుకెళ్లగా, పీవీ సింధు ఓటమిపాలైంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్లో శ్రీకాంత్ 21–17, 22–20తో సహచరుడు లక్ష్యసేన్పై గెలిచాడు. 45 నిమిషాల మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు హోరాహోరీగా పోరాడినా కీలక టైమ్లో అనుభవాన్ని ఉపయోగించిన శ్రీకాంత్ విజయాన్ని అందుకున్నాడు. ఫలితంగా హెడ్ టు హెడ్ రికార్డును 3–0కు పెంచుకున్నాడు.
మరో మ్యాచ్లో ప్రణయ్ 21–18, 21–16తో అంగుస్ ఎంగ్ కా లాంగ్ (హాంకాంగ్)ను ఓడించాడు. ప్రియాన్షు రజావత్ 22–20, 15–21, 15–21తో ఆంథోని సినిసుకా గింటింగ్ (ఇండోనేసియా) చేతిలో ఓడాడు. విమెన్స్ సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో సింధు 18–21, 16–21తో మూడోసీడ్ తై జు యింగ్ (చైనీస్తైపీ) చేతిలో ఓడింది. గత రెండు టోర్నీల్లోనూ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగింది. తైజుతో జరిగిన గత మ్యాచ్ల్లోనూ తీవ్రంగా నిరాశపర్చిన తెలుగమ్మాయి హెడ్ టు హెడ్ రికార్డు 5–19గా ఉంది. మెన్స్ డబుల్స్లో సాత్విక్–చిరాగ్ షెట్టి 21–17, 21–15తో హి జి టింగ్–జావో హు డాంగ్ (చైనా)పై గెలిచి క్వార్టర్స్లో అడుగుపెట్టారు.