
ఇండోర్: మధ్యప్రదేశ్లో హాట్ స్పాట్గా మారిన సిటీ ఇండోర్. రోజు రోజుకూ కేసులు పెరిగిపోతుండటంతో వైరస్ ను కట్టడి చేసేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసుల్లో స్ఫూర్తి నింపడానికి ఇండోర్ సిటీ పోలీస్ చీఫ్ ఏకంగా పాటపాడారు. వారు ఇప్పటి వరకూ చేసిన సేవలను గుర్తు చేస్తూ మరింత సమర్థంగా పనిచేసేలా ప్రోత్సహించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండోర్ జోన్ ఇన్స్పెక్టర్ జనరల్ వివేక్ శర్మ ‘‘హమ్ హోంగే కాంయాబ్(మనం దీనిని అధిగమిస్తాం)”అంటూ ఈ పాట పాడారు. ‘‘ఈ సాంగ్ మనందరికీ ఒక మంచి సందేశం. మనం కలిసి పోరాటం చేస్తే విజయం సాధిస్తాం. కరోనా వైరస్కు భయపడొద్దు. ఈ పోరాటంలో మనం కింద పడినా.. మరొకరిని కిందపడకుండా కాపాడదాం. మనం ఇలాగే పోరాటం చేస్తే విజయం మనదే. ఈ చాలెంజ్నే మనం ఒక అవకాశంగా తీసుకుందాం. సానుకూల ధృక్ఫథంతో ఉండండి.. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. ప్రతి రోజు మనం కలుస్తాం. మీరు పడుతున్న కష్టానికి నా సెల్యూట్”అంటూ తన టీమ్ మెంబర్లను ఉద్దేశించి వివేక్ శర్మ అన్నారు. 1960ల్లో అమెరికాలో పౌర హక్కులకు సంబంధించి జరిగిన ఆందోళనల్లో ‘‘వుయ్ షల్ ఓవర్కమ్”అనే పాట చాలా పాపులర్ అయ్యింది. దానిని హమ్ హోంగే కాంయాబ్ అంటూ హిందీ కవి గిరిజాకుమార్ మాధుర్ అనువాదం చేశారు. మరో వీడియోలో వివేక్ శర్మ పాటను తమ హెడ్ సెట్లలో విన్న మరికొందరు పోలీసులు.. ఆయనతో పాటు తాము కూడా పాట పాడారు. ఇండోర్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వివేక్ శర్మ తన సిబ్బందికి సూచించారు. అలాంటి వారిపై బలప్రయోగం చేయకుండా.. వారితో ఎండలో పని చేయించాలని.. దానిని వీడియో తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని చెప్పారు. దాని వల్ల ఇంకెవరూ లాక్డౌన్ను ఉల్లంఘించరని చెప్పారు. మధ్యప్రదేశ్లో మొత్తం 562 కేసులు నమోదైతే.. అందులో ఇండోర్లో రిపోర్ట్ అయినవే 311 కేసులు. రాష్ట్రంలో కరోనాతో 41 మంది చనిపోతే ఇండోర్లో 30 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.