జగిత్యాల ప్రజావాణిలో అమానవీయ ఘటన..ఫిర్యాదు చేసిన దివ్యాంగుడిని బయటికి నెట్టేశారు

జగిత్యాల ప్రజావాణిలో అమానవీయ ఘటన..ఫిర్యాదు చేసిన దివ్యాంగుడిని బయటికి నెట్టేశారు

జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది.. ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన దివ్యాంగుడిని ఘోరంగా అవమానించి బయటికి పంపించారు. ఇంటి సమస్య విషయంలో దివ్యాంగుడు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాకపోవడంతో మరోసారి ఫిర్యాదుచేసేందుకు ప్రజావాణికి వచ్చారు. ఈ ఘటన సోమవారం(ఆగస్టు 11) జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే. 

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన దివ్యాంగుడు మర్రిపల్లి రాజ గంగారాం తన ఇంటి స్థలంలో అక్రమంగా గోడ నిర్మిస్తున్నారని ఆవేదనతో చెందాడు. ఈ సమస్య పరిష్కారం కోసం అతను గత వారం రోజులుగా ప్రయత్నిస్తున్నాడు.

ALSO READ : కీసర ORR పై ఘోర రోడ్డుప్రమాదం..

ఆగస్టు 4న గంగారాం ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్ ముందు నిరసన చేశాడు. స్పందిచిన కలెక్టర్ సత్యప్రసాద్ సహాయక అధికారులను ఘటనా స్థలానికి పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అయితే అధికారులు ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో గంగారాం మళ్లీ నిరాశగా వెనక్కి వెళ్లాడు. సమస్య పరిష్కారం కాకపోవడంతో అతను మళ్లీ ప్రజావాణిలో ఫిర్యాదు చేసేందుకు వచ్చాడు. 

ఘోర అవమానం

సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో గంగారాం తన వీల్‌చైర్‌లో అదనపు కలెక్టర్ ముందు తన సమస్యను వివరిస్తుండగా కలెక్టరేట్ సిబ్బంది అతన్ని బయటకు నెట్టేశారు. తాగి వచ్చాడని అతని వీల్‌చైర్‌తో సహా బయటకు పంపించారు. ఈ ఘోర అవమానం కలెక్టర్ సత్యప్రసాద్ సమక్షంలోనే జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.

ప్రజల ఆగ్రహం

ఈ ఘటన సోషల్ మీడియాలో, స్థానికంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. ప్రజావాణి కార్యక్రమం సరిగా జరగడం లేదని అధికారులు దివ్యాంగులను కూడా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, గంగారాంకు న్యాయం చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఘటనతో అధికారుల నిర్లక్ష్యం, బాధితులకు అవమానం అనే అంశాలు తెరమీదికి వచ్చాయి. సమస్యను పరిష్కరించకుండా, బాధితుడిని అవమానించడం పట్ల కలెక్టర్ కార్యాలయం తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.