
సిద్దిపేట/ దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో రామలింగారెడ్డి మరణం తరువాత అసమ్మతి వాదులు గళాలు విప్పుతున్నారు. కొద్ది రోజులుగా దుబ్బాకలో అసమ్మతి స్వరాలు వినిపిస్తుండగా శనివారం జరిగిన పరిణామాలు మరింత వేడిని రగిల్చాయి. నియోజకవర్గ కేంద్రమైన దుబ్బాకలో శనివారం అసంతృప్త నేతలు బహిరంగంగా ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ ఆవిర్భావం నుంచి కష్టపడి పనిచేసిన వారికి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రామలింగారెడ్డి వెంట నలుగురు వ్యక్తులు ఉండి దుబ్బాక రాజకీయానికి, టీఆర్ఎస్ పార్టీకి మచ్చ తీసుకువచ్చారని ఆరోపించారు. రాబోయే ఉప ఎన్నికల్లో ఆ కుటుంబానికి టికెట్టు ఇస్తే మళ్లీ తమను అణగదొక్కుతారని ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ న్యాయం జరిగేలా ఓ మంచి నాయకునికి టికెట్టు ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ ఎల్లారెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ రవీంద్రరెడ్డి, ఆత్మ కమిటీ మాజీ ఛైర్మన్ రాజయ్యతోపాటు పార్టీ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తొగుట కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం
తొగుట మండలంలోని టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అసమ్మతి నేతల మధ్య సయోధ్య కుదర్చడం కోసం శనివారం ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కొండపాకలోని మెదక్ ఇంజినీరింగ్ కాలేజీలో ప్ర్యతేక సమావేశం ఏర్పాటు చేశారు. మండల పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే అనవసరమైన సమస్యలు ఏర్పడతాయని పక్క మండలంలో నిర్వహించినా చివరకు రసాభాసగా మారింది. జడ్పీటీసీ ఇంద్రసేనారెడ్డి, ఎంపీపీ భర్త నరేందర్రెడ్డి మధ్య సమావేశం సందర్భంగా వాగ్వివాదం జరిగింది. వారిద్దరిని శాంతిపజేయాలని నాయకులు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కలగజేసుకుని ఇరువర్గాలను సముదాయించే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. దీంతో అందరిని అక్కడి నుంచి పంపించి వేశారు.
టిక్కెట్టు కోసం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నాలు
మాజీ మంత్రి చెరుకు ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ నెల 2న చెరుకు ముత్యంరెడ్డి ప్రథమ వర్థంతి సందర్భంగా నియోజకవర్గంలోని మండలాల్లో బల ప్రదర్శన సైతం నిర్వహించారు. ఓవైపు దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి కుటుంబానికే టీఆర్ఎస్ టికెట్ దక్కుతుందనే ప్రచారం సాగుతున్నా చెరుకు శ్రీనివాసరెడ్డి సైతం ప్రయత్నాలు సాగిస్తుండటం ఆసక్తిని కలిగిస్తోంది.
For More News..