
న్యూఢిల్లీ : క్రయోజెనిక్ ట్యాంక్ తయారీ సంస్థ ఐనాక్స్ ఇండియా లిమిటెడ్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సమీకరించడానికి క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దరఖాస్తు అందజేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ప్రకారం, ఐపీఓ ద్వారా కంపెనీ ప్రస్తుత వాటాదారులు, ప్రమోటర్ల ద్వారా 2.21 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా అమ్ముతారు. ఓఎఫ్ఎస్లో వాటాలను అందిస్తున్న వారిలో సిద్ధార్థ్ జైన్, పవన్ కుమార్ జైన్, నయనతార జైన్, ఇషితా జైన్, మంజు జైన్ ఉన్నారు.
ఇష్యూ పూర్తిగా ఓఎఫ్ఎస్ అయినందున, కంపెనీ ఎటువంటి ఆదాయాన్నీ పొందదు. మొత్తం నిధులన్నీ వాటాదారులకు వెళ్తాయి. వడోదరకు చెందిన ఐనాక్స్ ఇండియా క్రయోజెనిక్ ట్యాంక్ డిజైన్, ఇంజినీరింగ్, తయారీలో ఉంది. గత 30 ఏళ్లుగా క్రయోజెనిక్ పరిస్థితుల కోసం పరికరాలు సిస్టమ్ల ఇన్స్టాలేషన్లను కూడా అందిస్తోంది. పారిశ్రామిక వాయువులు, ఎల్ఎన్జీ, గ్రీన్ హైడ్రోజన్, శక్తి, ఉక్కు, వైద్య, ఆరోగ్య సంరక్షణ, రసాయనాలు, ఎరువులు వంటి పరిశ్రమలలో ఉపయోగించే పెద్ద టర్న్ కీ ప్రాజెక్ట్లను సంస్థ చేపడుతోంది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ యాక్సిస్ క్యాపిటల్ ఇష్యూకి బుక్- రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉన్నాయి.