- ఎక్స్ పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్.. సర్కార్ కు నివేదిక
- క్లినికల్ లో 20, నాన్ క్లినికల్ లో 40 శాతం
- సర్కార్ దవాఖాన్లలో కనీసం రెండేండ్లు పనిచేస్తేనే అర్హత
హైదరాబాద్, వెలుగు: మెడికల్ పీజీ సీట్ల కేటాయింపులో ఇన్సర్వీస్ కోటాను పునరుద్ధరించేందుకు ఎక్స్పర్ట్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్లినికల్ విభాగంలో 20%, నాన్ క్లినికల్ విభాగంలో 40% సీట్లను ఇన్సర్వీస్ డాక్టర్లకు కేటాయించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ మేరకు డీఎంఈ రమేశ్రెడ్డి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ వీసీ కరుణాకర్రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావులతో కూడిన కమిటీ రెండ్రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇన్సర్వీస్ కోటా అమలు సాధ్యాసాధ్యాలపై స్టడీ చేసి నివేదిక ఇచ్చేందుకు పోయిన నెలలో హెల్త్ సెక్రటరీ ఈ కమిటీని నియమించారు. కోటా అమలుకు సర్కార్ పాజిటివ్గా ఉండడంతో, 20 రోజుల్లోనే కమిటీ నివేదిక ఇచ్చింది. మన రాష్ట్రంలో, దేశంలో 2017 వరకూ ఇన్సర్వీస్ కోటా ఉండేది. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్ట సవరణతో ఈ కోటా రద్దైంది. తమిళనాడు, కేరళ, గుజరాత్ తదితర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఇన్సర్వీస్ కోటా రాష్ట్ర పరిధిలోని అంశమని నిరుడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో సుమారు 11 రాష్ట్రాలు ఇన్సర్వీస్ కోటాను పునరుద్ధరించాయి. మన రాష్ట్రంలోనూ ఇన్సర్వీస్ కోటా అమలు చేయాలని రెండేండ్లుగా ప్రభుత్వ వైద్య సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అమలు చేయొద్దని ప్రైవేటు డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ దవాఖాన్లలో డాక్టర్ల కొరతను దృష్టిలో పెట్టుకుని, కోటా అమలుకే సర్కార్ మొగ్గు చూపుతోంది. ఒకట్రెండు వారాల్లోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
క్లినికల్లో 30 శాతం!
రాష్ట్రంలో ప్రభుత్వ కాలేజీల్లో సుమారు 900 పీజీ సీట్లు ఉండగా, ప్రైవేటులో 1,117 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లోని సగం సీట్లను నేషనల్ పూల్కి కేటాయించి, మిగతా సగం సీట్లను రాష్ట్ర కోటాలో భర్తీ చేస్తారు. ప్రైవేటు కాలేజీల్లోని సగం సీట్లను మేనేజ్మెంట్ కోటాలో, మిగతా సగం సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. క్లినికల్ సీట్లలో 20%, నాన్ క్లినికల్ సీట్లలో 40% ఇన్సర్వీస్ కోటా కింద రిజర్వ్ చేయాలని కమిటీ సూచించింది. గతంలో క్లినికల్ సీట్లకు 30%, నాన్క్లినికల్లో 50% ఇన్సర్వీస్ కోటా ఉండేది. ప్రైవేటు డాక్టర్లు వ్యతిరేకిస్తుండడంతో ఆ కోటాను 10% చొప్పున తగ్గించాలని నిర్ణయించారు.
కండీషన్స్ అప్లై
ఇన్సర్వీస్ కోటా రిజర్వేషన్లు పొందడానికి కమిటీ కొన్ని సూచనలు చేసింది. ట్రైబల్ ఏరియాలోని ప్రభుత్వ దవాఖానల్లో రెండేళ్లపాటు పనిచేసినవారు ఇన్సర్వీస్ కోటాలో పీజీ సీటు పొందేందుకు అర్హత ఉంటుంది. పల్లెల్లో మూడేండ్లు, పట్టణాల్లో ఆరేండ్ల పాటు పనిచేయాల్సి ఉంటుంది. అప్పుడే వారు ఇన్సర్వీస్ కోటాకు అర్హులవుతారు. నీట్ పీజీ ఎగ్జామ్లో కనీసం 50% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇన్సర్వీస్ కోటాలో పీజీ పూర్తి అయ్యాక కనీసం ఐదేండ్లు ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేస్తానని ముందే బాండ్ రాసి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ బాండ్ను ఉల్లంఘిస్తే భారీ జరిమానా విధించాలని కమిటీ సూచించింది. గతంలో రూ.20 లక్షలుగా ఉన్న ఈ ఫైన్ను ఈ ఏడాదినుంచి సుమారు రూ.50 నుంచి 75 లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్టు ఆఫీసర్లు చెబుతున్నారు.
ఇదీ లాభం
ప్రభుత్వ దవాఖాన్లలో రెగ్యులర్ రిక్రూట్మెంట్లు లేకపోవడం, టెంపరరీ పోస్టులకు అత్తెసరు జీతాలు ఇస్తుండడంతో ప్రభుత్వ దవాఖాన్లలో పనిచేసేందుకు స్పెషలిస్టు డాక్టర్లు ఇష్టపడడం లేదు. ఇన్సర్వీస్ కోటాపై ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న సర్కార్, ఇప్పుడు సానుకూల నిర్ణయం తీసుకుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎంబీబీఎస్ సీట్ల కంటే పీజీ సీట్లు చాలా తక్కువగాఉండడంతో, పీజీ సీటు సాధించడం చాలా కష్టంగా మారింది. దీంతో ఇన్సర్వీస్ రిజర్వేషన్ కోసమైనా ఎంబీబీఎస్ పూర్తవగానే ప్రభుత్వ సర్వీస్లోకి వచ్చేందుకు డాక్టర్లు ఇష్టపడ్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇక్కడికొచ్చాక ఇన్సర్వీస్ కేటగిరీ కింద పీజీ చేస్తే, మరో ఐదేండ్లు కచ్చితంగా ప్రభుత్వ సెక్టార్లో పనిచేయాల్సి ఉంటుంది. ఇలా డాక్టర్లను ప్రభుత్వ దవాఖాన్లలో.. ముఖ్యంగా ఏజెన్సీ, రూరల్ ఏరియాల్లో పనిచేయించేందుకు దోహదపడుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు.