
- కుళ్లిన కూరగాయలు, ఆహార పదార్థాలు, బొద్దింకలు
- అధ్వానంగా రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్లు
- గ్రేటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలతో వెలుగులోకి.. బిగ్ బాస్కెట్ వేర్హౌజ్లోనూ అదే పరిస్థితి
- ఓనర్లకు నోటీసులు ఇచ్చి హెచ్చరించిన అధికారులు
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లలో స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు రెస్టారెంట్లు, పబ్లు, బార్లపై దాడులు నిర్వహించిన అధికారులు.. గురు, శుక్రవారాల్లో కూడా తనిఖీలు చేపట్టారు. మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్, కొండాపూర్లోని బిగ్ బాస్కెట్ వేర్ హౌజ్, బాహుబలి కిచెన్, బంజారాహిల్స్లోని లెబనల్ ఫైన్ బేకింగ్, బాస్కిన్ రాబిన్స్, సోమాజిగూడలోని కృతుంగా, ఉప్పల్లోని మాస్టర్ చెఫ్ రెస్టారెంట్లను పరిశీలించారు. ఎక్స్పైరీ అయిన చాక్లెట్లు, పాలు, పెరుగు, కుళ్లిన ఆహార పదార్థాలు, కూరగాయలను గుర్తించారు. బొద్దింకలు తిరుగుతున్న అపరిశుభ్ర కిచెన్లు చూసి నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పలు రెస్టారెంట్లపై అధికారులు కేసులు రిజిస్టర్ చేశారు.
బిగ్ బాస్కెట్ వేర్ హౌజ్లో కాలం చెల్లిన మసాలాలు
కొండాపూర్లోని మజీద్ బండలో ఉన్న బిగ్ బాస్కెట్ వేర్ హౌస్ను అధికారులు తనిఖీ చేశారు. కాలం చెల్లిన చికెన్ మసాలాలు, చికెన్ సాస్, పిజ్జా చీజ్, పనీర్, ఐస్క్రీమ్స్, ఆల్మండ్ ఫడ్జ్లను గుర్తించారు. అలాగే వంట నూనెలకు సంబంధించిన ప్యాకెట్లు, డబ్బాలు లీకేజీ అవుతూ మిగిలిన ఆహార పదార్థాలను కలుషితం చేస్తుండటంపై నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాల బాటిళ్లు, థిక్ షేక్ బాటిల్స్, స్టింగ్ టిన్ బాటిళ్లను సరైన రీతిలో స్టోరేజ్ చేయకపోవడంపై మండిపడ్డారు. ఇష్టమొచ్చినట్టు వాటిని పడేయడంతో నిర్వాహకులకు నోటీసులు ఇచ్చారు. మిగిలిన అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లలోనూ తనిఖీలు చేపట్టి కేసులు నమోదు చేశామని ఫుడ్ సేఫ్టీ అధికారులు తెలిపారు. సిటీలోని మరిన్ని ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. కిచెన్తో పాటు పరిసర ప్రాంతాలను క్లీన్గా ఉంచుకోవాలని సూచించారు.
రామేశ్వరం కేఫ్లో పాలు, పెరుగు ధ్వంసం
మాదాపూర్లోని రామేశ్వరం కేఫ్లో గురువారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎక్స్పైరీ డేట్ దాటిన వంద కిలోల మినపప్పు బస్తాలను గుర్తించారు. గడువు తీరిన 10 కిలోల నంది పెరుగు, 8 లీటర్ల పాలు గుర్తించి ధ్వంసం చేశారు. గలీజ్గా ఉన్న కిచెన్, రిఫ్రిజిరేటర్లో సగం వండిన ఆహార పదార్థాలు, మురికి నీళ్లతో నిండిన క్లీనింగ్ ఏరియాను చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఫిట్నెస్, ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే హోటల్ నడుపుతున్నట్లు గుర్తించి, ఓనర్కు నోటీసులిచ్చారు. తర్వాత శుక్రవారం బాహుబలి కిచెన్లో తనిఖీలు నిర్వహించిన అధికారులకు స్టోర్ రూమ్లోని ఆహార పదార్థాలన్నీ బొద్దింకలతో నిండిపోయి కనిపించాయి. కిచెన్లో కూడా బొద్దింకలే దర్శనమిచ్చాయి.