
భైంసా, వెలుగు : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని బంగారు దుకాణాల్లో బుధవారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ‘భైంసాలో పసిడి దగా..!’ అంటూ ఈ నెల 22న ‘వెలుగు’లో పబ్లిష్ అయిన వార్తకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి టి. శ్రీనివాస్ స్పందించి తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అసిస్టెంట్ కమిషనర్ గోదావరి, డీసీటీవోలు సునీత, శ్వేతతో పాటు ఏసీటీవోలు శ్రీనివాస్, మహేశ్ ఆధ్వర్యంలో రెండు టీమ్స్ వేర్వేరుగా దుకాణాల్లో తనిఖీలు చేపట్టాయి.
ముందుగా అసద్ బాబానగర్లోని ఓ బంగారం షాపులో అసిస్టెంట్ కమిషనర్ గోదావరి టీమ్ తనిఖీలు చేపట్టగా, మరో టీమ్ మున్సిపల్ ఆఫీస్ ముందు గల బంగారు దుకాణంలో తనిఖీ చేశారు. అనంతరం ఆఫీసర్లు వ్యాపారులతో భేటీ అయి పలు సూచనలు చేశారు. ప్రతి వ్యాపారి తప్పనిసరిగా జీఎస్టీ నంబర్ తీసుకోవాలని ఆదేసించారు. రూల్స్ పాటించకపోతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, ఆఫీసర్ల తనిఖీ విషయం తెలుసుకున్న చాలామంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు.