- రూల్స్ను సరళీకరించడమే కారణం
- వెల్లడించిన కేంద్ర ఆర్థికశాఖ
న్యూఢిల్లీ : ఓవర్సీస్ క్యాపిటల్ ఫ్లో రూల్స్ను మరింత సరళీకరించడంతో బీమా రంగానికి గత 9 ఏళ్లలో దాదాపు రూ.54వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) అందాయని ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఎఫ్డీఐ పరిమితిని 2014లో 26 శాతం నుంచి 2015లో 49 శాతానికి పెంచారు. ఆపై 2021లో 74 శాతానికి పెంచామని ఆయన ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
బీమా మధ్యవర్తులకు ఎఫ్డీఐ పరిమితిని 2019లో 100 శాతానికి పెంచామని ఆయన చెప్పారు. ఫలితంగా 2014 డిసెంబర్ నుంచి 2024 జనవరి మధ్య బీమా కంపెనీల నుంచి రూ.53,900 కోట్ల విలువైన ఎఫ్డీఐలు వచ్చాయి. ఈ ఏడాది జనవరి నాటికి బీమా కంపెనీల సంఖ్య 70కి పెరిగిందని జోషి చెప్పారు. బీమా వ్యాప్తి 2013-–14లో 3.9 శాతం నుంచి 2022–-23లో 4 శాతానికి పెరిగిందని
బీమా సాంద్రత 2013-–14లో 52 నుంచి 2022–-23లో 92కి పెరిగిందని ఆయన చెప్పారు. బీమా వ్యాప్తి, సాంద్రత అనే రెండు కొలమానాలను దేశంలో బీమా రంగం అభివృద్ధి స్థాయిని అంచనా వేయడానికి తరచుగా ఉపయోగిస్తారు. బీమా వ్యాప్తిని జీడీపీకి బీమా ప్రీమియం శాతంగా కొలుస్తారు. బీమా సాంద్రత జనాభాకు ప్రీమియం నిష్పత్తిగా (తలసరి ప్రీమియం) లెక్కిస్తారు.
పెరిగిన ఏయూఎం
2013–-14లో రూ. 21.07 లక్షల కోట్లతో పోలిస్తే అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఏయూఎం) దాదాపు మూడు రెట్లు పెరిగి రూ. 60.04 లక్షల కోట్లకు చేరుకుంది. మొత్తం బీమా ప్రీమియం మార్చి 2014 చివరి నాటికి రూ. 3.94 లక్షల కోట్ల నుంచి రూ. 10.4 లక్షల కోట్లకు రెట్టింపు పెరిగింది. ఆగస్టు 2000లో ప్రైవేట్ కంపెనీల కోసం బీమా రంగం తలుపులు తెరిచారు. విదేశీ కంపెనీలకు 26 శాతం వరకు యాజమాన్యాన్ని అనుమతించారు. అప్పటి నుంచి అనేక విదేశీ కంపెనీలు బీమా రంగంలో పెట్టుబడులు పెట్టాయి.
తాజాగా జ్యూరిక్ ఇన్సూరెన్స్- కోటక్ జనరల్ ఇన్సూరెన్స్ ఒప్పందం బీమా రంగంలో ప్రధాన ఎఫ్డీఐ ఫ్లోలలో ఒకటి. గత నెలలో, జ్యూరిక్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా జనరల్ ఇన్సూరెన్స్లో 70 శాతం వాటాను రూ. 5,560 కోట్లకు ఒకే విడతలో కొనుగోలు చేయాలని ప్రతిపాదించింది. నవంబర్ 2023లో, కోటక్ మహీంద్రా బ్యాంక్ తన జనరల్ ఇన్సూరెన్స్
విభాగంలో 51 శాతం వాటాను జ్యూరిక్ ఇన్సూరెన్స్కు రూ. 4,051 కోట్లకు ఫ్రెష్ క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ షేర్ కొనుగోలు ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత మూడేళ్లలో మరో 19 శాతం వాటా విక్రయం ఉంటుంది.