
అమరావతి: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఇంటర్ సెకండియర్ విద్యార్థినిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని దుండగులు. విద్యార్థినిపై పెట్రోల్ పోసి కాల్చి కిరాతకంగా చంపారు. అనంతరం మృతదేహాన్ని మణిపాల్ స్కూల్ వెనక పడేశారు ఆగంతకులు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు.
విద్యార్థిని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా గత మంగళవారం (జూన్ 3) నుంచి తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు బాధిత యువతి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కంప్లైంట్ చేసిన పోలీసులు పట్టించుకోలేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకుంటే తమ కూతురు దక్కేదని మృతురాలి తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. యువతిని కిరాతకంగా హత్య చేసిన దుండగుల కోసం వేట కొనసాగిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.