- ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి
నారాయణగూడ, వెలుగు: రాష్ట్రంలోని వీవోఏలు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఐఎన్టీయూసీ రాష్ట్ర ముఖ్య ఉపాధ్యక్షుడు మొగుళ్ల రాజిరెడ్డి అన్నారు. బుధవారం నారాయణగూడలోని ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐకేపీ వీవోఏ సంఘం, తెలంగాణ రాష్ట్ర ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ సమావేశం నిర్వహించారు.
ఆయన మాట్లాడుతూ.. వీవోఏలకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నెలకు రూ.3 వేల నుంచి రూ.5 వేలే చెల్లిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస వేతనాలు పెంచిందని తెలిపారు. వీవోఏలకు నెలకు రూ.26 వేలు, ఉద్యోగ భద్రత, బీమా వంటి అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వై.నాగన్న గౌడ్, తెలంగాణ జలమండలి ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి టీపీ.రాఘవేంద్ర రాజ్, వీవోఏ సంఘం అధ్యక్షుడు అరుణారెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం అధ్యక్షుడు రవి పాల్గొన్నారు.
