న్యూఢిల్లీ: డెట్/ఫిక్స్డ్-ఇన్కమ్ మ్యూచువల్ ఫండ్లలోకి (ఎంఎఫ్) గత నెల పెట్టుబడులు వెల్లువెత్తాయి. లిక్విడ్ ఓవర్నైట్ ఫండ్లలో బలమైన పెట్టుబడుల కారణంగా వీటి విలువ రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. అయితే, సెప్టెంబరులో రూ. 1.02 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు.
అక్టోబరులో పెట్టుబడులు డెట్-ఆధారిత మ్యూచువల్ ఫండ్ల నిర్వహణలోని ఆస్తుల (ఏయూఎం) విలువను దాదాపు 10 శాతం పెంచాయి. సెప్టెంబర్లో రూ. 17.8 లక్షల కోట్లు ఉన్న ఏయూఎం అక్టోబర్ నెలాఖరు నాటికి రూ. 19.51 లక్షల కోట్లకు పెరిగినట్లు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. దీని ప్రకారం.. ఆగస్టులో, ఈ ఫండ్లలో రూ. 7,980 కోట్ల ఔట్ఫ్లో ఉంది.
జులైలో మాత్రం రూ. 1.07 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. ఆర్బీఐ వడ్డీ రేట్ల కోత గురించి మరింత స్పష్టత కోసం ప్రస్తుతం పెట్టుబడిదారులు ఎదురుచూస్తున్నారు. ఫండ్ల ప్రవాహాలు లిక్విడ్, మనీ మార్కెట్, హై-క్వాలిటీ అక్రూవల్ విభాగాలలోనే ఉండవచ్చని మార్నింగ్స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఎనలిస్ట్ నెహల్ మేశ్రామ్ చెప్పారు. సంస్థాగత పెట్టుబడిదారులు మిగులు డబ్బులు తిరిగి పెట్టుబడి పెట్టడం వలన అక్టోబర్లో ఔట్ఫ్లో విపరీతంగా పెరిగిందని వివరించారు.
పది కేటగిరీల్లో భారీ ఇన్వెస్ట్మెంట్లు..
మొత్తం 16 డెట్ కేటగిరీలలో, 10 కేటగిరీలు పెద్ద ఎత్తున నికర పెట్టుబడులను ఆకర్షించాయి. వీటిలో, లిక్విడ్ ఫండ్లు రూ. 89,375 కోట్ల పెట్టుబడులతో ముందున్నాయి. సెప్టెంబరులో మాత్రం రూ. 66,042 కోట్ల ఔట్ఫ్లో కనిపించింది. ఓవర్నైట్ ఫండ్లు రూ. 24,051 కోట్లను ఆకర్షించాయి.
మనీ మార్కెట్ ఫండ్లు కూడా బలంగా పుంజుకుని రూ. 17,916 కోట్లను సంపాదించాయి. షార్ట్-డ్యూరేషన్ విభాగంలో ఇన్ఫ్లోలు పుంజుకున్నాయి. కార్పొరేట్ బాండ్ ఫండ్లలోకి రూ. 5,121 కోట్లు వచ్చాయి. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ మాత్రం బలహీనంగా ఉన్నాయి.
డైనమిక్ బాండ్ ఫండ్ల నుంచి ఇన్వెస్టర్లు రూ. 232 కోట్లను వెనక్కి తీసుకున్నారు. గిల్ట్ ఫండ్లలో రూ. 931 కోట్ల ఔట్ఫ్లో ఉంది. ఈక్విటీ ఎంఎఫ్లలోకి అక్టోబర్లో రూ. 24,690 కోట్లు వచ్చాయి. ఇవి సెప్టెంబర్లో రూ. 30,421 కోట్లను ఆకర్షించాయి.
