డబ్ల్యూఎఫ్‌‌ఐకి అడ్‌‌హక్‌‌ కమిటీ

డబ్ల్యూఎఫ్‌‌ఐకి అడ్‌‌హక్‌‌ కమిటీ

న్యూఢిల్లీ : రెజ్లింగ్‌‌ ఫెడరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌‌ఐ) రోజువారి కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన అడ్‌‌హక్‌‌ కమిటీని ఇండియన్‌‌ ఒలింపిక్‌‌ అసోసియేషన్‌‌ (ఐవోఏ) బుధవారం ఏర్పాటు చేసింది. వుషు అసోసియేషన్‌‌ ప్రెసిడెంట్‌‌ భూపిందర్‌‌ సింగ్‌‌ బాజ్వా చైర్మన్‌‌గా ఉన్న ఈ కమిటీలో హాకీ ఒలింపియన్‌‌ ఎంఎం సౌమ్య, మాజీ షట్లర్‌‌ మంజుషా కన్వర్‌‌ సభ్యులుగా ఉన్నారు. 

డబ్ల్యూఎఫ్‌‌ఐ కొత్త ప్రెసిడెంట్‌‌గా ఎన్నికైన సంజయ్‌‌ సింగ్‌‌ ప్యానెల్‌‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు చెల్లవని ఐవోఏ ప్రకటించింది. ఇక నుంచి డబ్ల్యూఎఫ్‌‌ కార్యక్రమాలను అడ్‌‌హక్‌‌ కమిటీయే పర్యవేక్షిస్తుందని తెలిపింది. ‘ఇంటర్నేషనల్‌‌ ఈవెంట్ల కోసం రెజ్లర్ల ఎంపిక, టోర్నీలకు సంబంధించిన షెడ్యూల్స్‌‌ను రూపొందించడం, సమాఖ్య కార్యకలాపాలు, బ్యాంక్‌‌ ఖాతాలను నిర్వహించడం, వెబ్‌‌సైట్‌‌ నిర్వహణ వంటి అన్ని అంశాలను కమిటీ పర్యవేక్షిస్తుంది. 

రెజ్లర్లు, సమాఖ్య ప్రయోజనాలను కాపాడటానికే కొత్త కమిటీని ఏర్పాటు  చేశాం. ఇందులో ఎవరి జోక్యాన్ని సహించబోం. పరిపాలన సజావుగా సాగేందుకు అవసరమైన సహాయ సహకారాలు ఐవోఏ అందిస్తుంది’ అని ఐవోఏ ప్రెసిడెంట్‌‌ పీటీ ఉష పేర్కొంది.