
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదమూడో సీజన్ జరగడం ఇక కష్టమే అనిపిస్తోంది. కరోనా వ్యాప్తి అడ్డుకట్టకు దేశంలో లాక్డౌన్ను వచ్చే నెల మూడో తేదీ వరకూ పొడిగిస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడంతో ఐపీఎల్పై ఆశలు దాదాపు ఆవిరయ్యాయి. మార్చి 29న మొదలవ్వాల్సిన ఈ మెగా లీగ్ ఇప్పటికే ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ కావడంతో ఏప్రిల్–మే విండో అందుబాటులో లేకుండా పోయింది. 2008లో టోర్నీ మొదలైనప్పటి నుంచి ఈ సమయంలోనే జరుగుతూ వస్తోంది. కానీ, కరోనా కారణంగా ఈ సారి మాత్రం ఆ టైమ్ను బోర్డు కోల్పోనుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో లీగ్ను నిరవధికంగా వాయిదా వేయడం తప్ప బీసీసీఐ ముందు వేరే ఆప్షన్ లేకుండా పోయింది. లాక్డౌన్ పొడిగింపు విషయంలో కేంద్రం నుంచి గైడ్లైన్స్ రావడంతో పాటు మే మూడు తర్వాత లీగ్ నిర్వహించే అవకాశం ఉందా? అనే విషయాన్ని చర్చించిన తర్వాత బోర్డు తన నిర్ణయాన్ని వెల్లడించనుంది.
రద్దు తప్పదా?
ఇండియాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఈ సీజన్ రద్దయ్యే చాన్సులే ఎక్కువ అని బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వాయిదా పడ్డ ఇతర దేశాల బైలేటర్ సిరీస్ల కోసం మే–జూన్ విండోను ఉపయోగించుకోవాలని ఐసీసీ భావిస్తోంది. అలాగే, సెప్టెంబర్–నవంబర్ మధ్యలో సమయంలో లీగ్ను పట్టాలెక్కాలించాలని ఆలోచిస్తున్నా.. ఆ టైమ్లో ఆసియా కప్తో పాటు టీ20 వరల్డ్ కప్ నిర్వహించాల్సి ఉంది. ఒకవేళ ఈ రెండు టోర్నీలు రద్దయితే లీగ్కు మార్గం సుగమం అయ్యే చాన్స్ ఉందని బోర్డు వర్గాలు భావించాయి. కానీ, ఆస్ట్రేలియాలో ఆరు నెలల ట్రావెల్ బ్యాన్ విధించడంతో ఆ దేశ క్రికెటర్లు అందుబాటులో ఉండే చాన్స్ లేదు. లీగ్ విషయంలో బోర్డు కూడా మొండిగా వ్యవహరించడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా జన జీవనమే స్తంభించినప్పుడు ఇంక ఆటలకు ఎక్కడ చాన్స్ ఉందని బోర్డు ప్రెసిడెంట్ గంగూలీ అన్నాడు. లీగ్ను రీషెడ్యూల్ చేయాలంటే చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ట్రెజరర్ అరుణ్ ధుమల్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.