Virat Kohli: సెంచరీ తెచ్చిన తంటా..! చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీ

Virat Kohli: సెంచరీ తెచ్చిన తంటా..! చెత్త రికార్డు మూటగట్టుకున్న కోహ్లీ

పళ్లున్న చెట్టుకు రాళ్ల దెబ్బలు అన్నట్లు.. పరుగులు చేస్తున్న వాడిపైనే విమర్శలు వస్తున్నాయి. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 105.33 సగటుతో 316 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అగ్రస్థానంలో దూసుకెళ్తున్న కోహ్లీనే అందరూ విమర్శిస్తున్నారు. స్ట్రైక్ రేట్‌ను సాకుగా చూపుతూ రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు(ఆర్‍సీబీ) జట్టు ఓటములకు అతన్ని బాధ్యుణ్ణి చేస్తున్నారు.  అందుకు తగ్గట్టే కోహ్లీ సైతం.. పరుగులు చేస్తున్నప్పటికీ తన పేరిట ఓ చెత్త రికార్డు మూటగట్టుకోవడం కొసమెరుపు.

శనివారం(ఏప్రిల్ 6) రాత్రి రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ బాదిన కోహ్లీ.. ఎవరూ ఊహించని చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్‌లో సెంచరీ పూర్తి చేయడానికి ఎక్కువ బంతులు ఆడిన క్రికెటర్‌గా మనీశ్ పాండే సరసం నిలిచాడు. విరాట్.. 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 113 పరుగులు బాదినప్పటికీ సెంచరీ పూర్తి చేయడానికి 67 బంతులు ఆడడంతో ఈ అవాంఛిత రికార్డు అతని ఖాతాలో పడింది. కాగా 2009లో మనీశ్ పాండే ఆర్ సీబీ తరుపున డెక్కన్ ఛార్జర్స్‌పై 67 బంతుల్లో శతకాన్ని నమోదు చేశాడు.

ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ బంతుల్లో సెంచరీ చేసిన క్రికెటర్లు

  • మనీష్ పాండే : 67 బంతుల్లో (డెక్కన్ ఛార్జర్స్‌పై, 2009)
  • విరాట్ కోహ్లీ: 67 బంతుల్లో (రాజస్థాన్ రాయల్స్‌పై, 2024)
  • సచిన్ టెండూల్కర్: 66 బంతుల్లో ( కోల్ కతా నైట్ రైడర్స్ పై, 2024)
  • డేవిడ్ మిల్లర్: 66 బంతుల్లో ( కోల్ కతా నైట్ రైడర్స్ పై, 2024)
  • జోస్ బట్లర్: 66 బంతుల్లో (ముంబై ఇండియన్స్ పై, 2024)

ఇక మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 183 పరుగులు చేయగా.. రాజస్థాన్ బ్యాటర్లు దాన్ని 19.1 ఓవర్లలోనే ఛేదించారు. ఛేదనలో రాజస్థాన్ ఓపెనర్ జాస్ బట్లర్(100; 58 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్ లు), సంజూ శాంసన్(69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్ లు) పరుగులు చేశాడు.