కోల్కతా: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు జరిమానా పడింది. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో క్రికెట్ సామాగ్రిని దుర్వినియోగం చేసినందుకుగాను అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. దీంతో పాటు ఒక డీ మెరిట్ పాయింట్ కూడా కేటాయించారు. కోల్కతా ఇన్నింగ్స్ 10వ ఓవర్లో నాలుగో బంతి వేసిన అనంతరం పాండ్యా తీవ్ర అసహనంతో తన రనప్ వైపు వెళ్తూ వికెట్లపై ఉన్న బెయిల్స్ను గట్టిగా కిందకు పడేశాడు.
ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని లెవెల్–1లోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘించినట్లు మ్యాచ్ రెఫరీ రాజీవ్ సేథ్ నిర్ధారించారు. క్రీడా సామగ్రి లేదా మైదానంలోని వస్తువులను దుర్వినియోగం చేయడం ఈ నిబంధన పరిధిలోకి వస్తుంది. మ్యాచ్ రెఫరీ విధించిన ఈ శిక్షను, తన తప్పును హార్దిక్ పాండ్యా అంగీకరించాడు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం నాలుగు నుండి ఏడు డీ మెరిట్ పాయింట్లు నమోదైతే ఒక మ్యాచ్ సస్పెన్షన్ విధిస్తారు.
