
IPL లో మరో ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. బుధవారం కింగ్స్ ఎలెవెన్ పంజాబ్- రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో స్టేడియం మొత్తం నవ్వులతో దద్దరిల్లింది. టాస్ ఓడిన ఆర్సీబీ బ్యాటింగ్కు దిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్లో ఆ టీమ్ స్ట్రాటజిక్ టైమౌట్ తీసుకుంది. రెండున్నర నిమిషాల బ్రేక్ తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. ఆ సమయంలో పంజాబ్ బౌలర్ రాజ్ పుత్ బౌలింగ్ వేసేందుకు రెడీ అయ్యాడు. కానీ, అతడికి బాల్ ఎక్కడుందో కనిపించలేదు. రాజ్ పుత్ కే కాదు.. ఆ టీమ్ కెప్టెన్ అశ్విన్, మిగిలిన ఫీల్డర్లకు కూడా బాల్ కనిపించలేదు. దీంతో వారంతా అంపైర్ ను సంప్రదించారు
అంపైర్ కూడా తనకు తెలియదని చెప్పి, మరో బాల్ ఇవ్వాల్సిందిగా డగౌట్ లోకి సిగ్నల్ ఇచ్చాడు. దీంతో ఓ బాక్స్ పట్టుకుని మరో అంపైర్ ఫీల్డ్ లోకి వచ్చేశాడు. ఆయన దగ్గర నుంచి బాల్ తీసుకున్నారు. మరి, అప్పటి వరకు ఆడిన బాల్ ఏమైందని అంతా అనుకుంటున్న సమయంలో LED స్క్రీన్లపై ఓ వీడియో ప్రసారం అయింది. అందులో అసలు బాల్ ఏమైందన్న దానిపై క్లారిటీ వచ్చేసింది. దీంతో ఫీల్డ్ లో ఉన్న ప్లేయర్లతో క్రికెట్ చూస్తున్న వారంతా పగలబడి నవ్వుకున్నారు.
అసలేం జరిగిందంటే
మురుగన్ అశ్విన్ ఓవర్ ముగిసిన తర్వాత అతడు బాల్ ని ఫీల్డ్ అంపైర్ ఆక్షన్ ఫోర్డ్ కు ఇచ్చాడు. సరిగ్గా అప్పుడే బెంగళూరు టైమౌట్ తీసుకోవడంతో.. లెగ్ అంపైర్ షంషుద్దీన్ వచ్చి ఆక్షన్ ఫోర్డ్ చేతిలో ఉన్న బాల్ తీసుకుని తన జేబులో పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని మరిచిన ఆయన.. మరో బాల్ తీసుకు రమ్మని కోరాడు. అయితే, వీడియో ప్రసారం అయిన తర్వాత కొత్త బాల్ ని తన దగ్గర ఉంచుకుని, పాత బాల్ తో బౌలింగ్ చేయించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.