- కొన్ని ఏరియాలకే బీజేపీ పరిమితం
- గణనీయంగా పడిపోయిన బీఆర్ఎస్ గ్రాఫ్
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా వేళ్లూనుకుంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలుకొని ప్రస్తుత మున్సిపల్ ఎలక్షన్ ఫలితాలను చూస్తే కాంగ్రెస్ ప్రభావం గణనీయంగా పెరిగింది. పదేళ్ల పాటు ఆధిపత్యం చెలాయించిన బీఆర్ఎస్ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. బల్దియా ఎన్నికల ఫలితాలతో ఆ పార్టీ క్యాడర్లో నిరుత్సాహం నెలకొంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. బీజేపీ కొన్ని ప్రాంతాలకే పరిమితం కాగా గతం కంటే మెరుగుపడింది.
రివర్స్ గేర్లో బీఆర్ఎస్..
నగర పాలక సంస్థ పరిధిలోని 60 డివిజన్లతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల్లోని 86 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 61 స్థానాలు గెలుచుకుని నాలుగు స్థానిక సంస్థల్లోనూ జెండా ఎగరేసి సత్తా చాటుకుంది. పోలైన ఓట్లలో కాంగ్రెస్కు 1,13,308 ఓట్లు లభించాయి. 2014 నుంచి వరుసగా రెండు టర్మ్లు కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీల్లో పాలన సాగించిన బీఆర్ఎస్ ఈసారి 39,350 ఓట్లతో 15 స్థానాలకే పరిమితమైంది. 2025 వరకు పాలన సాగించిన నిజామాబాద్ కార్పొరేషన్లో కేవలం ఒకే స్థానం దక్కడం గమనార్హం. జిల్లాలోని 465 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు 55 మంది మాత్రమే గెలవగా, కాంగ్రెస్కు చెందిన 364 మంది సర్పంచ్లు విజేతలయ్యారు. అప్పటి ఫలితాల నుంచి కోలుకోవడానికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయగా ప్రజలు మరింత షాక్ ఇచ్చారు.
ఇందూర్లో బీజేపీ..
కార్పొరేషన్తో పాటు మూడు మున్సిపాలిటీల్లో బీజేపీకి 91,100 ఓట్లు లభించి 39 స్థానాల్లో గెలిచింది. నగర పాలక సంస్థలో 65,989 ఓట్లతో 28 డివిజన్లు గెలిచింది. కీరోల్ పోషించాలన్న అంచనాతో బోధన్లో పోటీ చేసి కేవలం 3 స్థానాలకే పరిమితమైంది, ఆర్మూర్ బల్దియా తమదేనన్న ధీమా వ్యక్తం చేసినా 8 వార్డుల్లోనే గెలిచింది. భీంగల్లో ఖాతా తెరవలేకపోయింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుదారులు 46 మంది గెలిచారు. గతంతో పోలిస్తే పార్టీ బలం కొంత పెరగడంతో బీజేపీ శ్రేణులకు ఊరటనిస్తోంది. మజ్లిస్ ప్రభావం ఎప్పటిలా నిజామాబాద్, బోధన్లో కనిపించింది. ఎంఐఎం 48,717 ఓట్లతో రెండు చోట్ల 27 స్థానాలు గెలుచుకుని డిప్యూటీ మేయర్, వైస్ చైర్పర్సన్ పదవులు దక్కించుకుంది. జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తుండడం విశేషం.కార్పొరేషన్/మున్సిపాలిటీల వారీగా గెలిచిన డివిజన్లు, వార్డులు
