టెహ్రాన్: చాబహర్–జహెదాన్ రైల్వే ప్రాజెక్టు నుంచి ఇండియా తప్పుకొందని మన దేశానికి చెందిన ఓ వార్తా పత్రిక రాసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. ఈ ప్రాజెక్టుపై ఇరాన్ పోర్ట్స్, మెరిటైమ్ ఆర్గనైజేషన్ డిప్యూటీ ఫర్హాద్ మోంటసేర్ స్పందించారు. ‘ఇది పూర్తిగా అవాస్తవం. చాబహర్–జహెదాన్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఇండియాతో మేం ఎలాంటి డీల్ చేసుకోలేదు’ అని బుధవారం ఫర్హాద్ చెప్పారని అల్ జజీరా పేర్కొంది.
‘చాబహర్లో ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ఇండియాతో ఇరాన్ రెండు అగ్రిమెంట్లపై మాత్రమే సంతకాలు చేసింది. అందులో ఒకటి పోర్టుల మెషినరీ, ఎక్విప్మెంట్ డీల్. రెండోది ఇండియా 150 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తుండటం’ అని మోంటసేర్ ఇరాన్ న్యూస్ ఏజెన్సీతో స్పష్టం చేసినట్లు సమాచారం. ఇరు దేశాల మధ్య ఉన్న ఆంక్షలతో చాబహర్లో ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని మోంటసేర్ వివరించారని తెలిసింది.