మామూళ్లిస్తే ఏ పనైనా ఓకే!.. ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో అక్రమాలు

మామూళ్లిస్తే ఏ పనైనా ఓకే!.. ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో అక్రమాలు
  • ఖమ్మం రవాణా శాఖ ఆఫీసులో అక్రమాలు
  • ఓనర్ లేకుండా టూ వీలర్​ రిజిస్ట్రేషన్ మార్పు
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన బాధితుడు 

ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయం అవినీతికి  కేరాఫ్​గా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు ఓనర్లకు   తెలియకుండానే వాహనాల రిజిస్ట్రేషన్లు మారిపోతున్నాయి. ప్రధానంగా టూ వీలర్ ఫైనాన్స్ సంస్థల ఆధ్వర్యంలో ఇలాంటి అక్రమాలు రెగ్యులర్​ గా జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొద్ది నెలల కింద ఓ బైక్​ ను తప్పుడు పేపర్లతో, తప్పుడు ఆధార్​ కార్డుతో రిజిస్ట్రేషన్​ మార్పు చేస్తున్నారంటూ ఓ ఏజెంట్ పై డీటీవోకు మరో ఏజెంట్ ఫిర్యాదు చేశారు.

దీంతో రిజిస్ట్రేషన్ ను నిలుపుదల చేయగా, ఇద్దరు ఏజెంట్లు రవాణాశాఖ ఆఫీసులోనే గొడవ పడ్డారు. తాజాగా కామేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తికి తెలియకుండానే ఆయన బైక్​ ను మరొకరి పేరుమీదకు మార్చేశారు. దీనిపై రెండ్రోజుల కింద జిల్లా రవాణా శాఖ అధికారికి బాధితుడు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఫేక్​ కాగితాలతో... 

ఖమ్మం నగరంలో 30కి పైగా ప్రైవేట్ టూవీలర్​ ఫైనాన్స్​ సంస్థలున్నాయి. బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీల నుంచి టూవీలర్ లోన్లు తీసుకొని, తిరిగి చెల్లించకపోతే ఆయా కంపెనీలు వాటిని రికవరీ చేస్తాయి. ఓనర్​ చనిపోయినా, ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోయినా బండిని లాక్కొచ్చి అమ్మకానికి పెడతాయి. ఒకేసారి పెద్ద సంఖ్యలో బైక్​ లను వేలంపాట నిర్వహిస్తాయి. టూ వీలర్​ ఫైనాన్స్​ వాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బండ్లను కొనుగోలు చేసి తీసుకువస్తున్నారు. వాటికి రిజిస్ట్రేషన్​ కార్డులు లేకపోయినా, బండి కొనుక్కున్న వ్యక్తి చనిపోయినా, వాటిని వేలం ద్వారా కొనుగోలు చేస్తున్నారు. వాటి రిజిస్ట్రేషన్ ను ఫేక్​ కాగితాలతో తయారు చేయిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

ఏజెంట్ల ద్వారా రవాణాశాఖలో సిబ్బందికి మామూళ్లు ఇవ్వడం, కొత్తగా తయారు చేసిన పేపర్లతో టూవీలర్లను తిరిగి ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల ద్వారా అమ్మకానికి పెట్టడం కామన్​ గా మారింది. ​టూ వీలర్​ కు ఎలాంటి పేపర్లు లేకుండా, రిజిస్ట్రేషన్​, నెంబర్​ ప్లేట్ లేకుండా వస్తే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో బండి పేపర్ల కోసం తప్పుడు మార్గాల్లో ఏజెంట్ల ద్వారా ప్రయత్నించడంతో ఆర్టీవో ఆఫీస్​ సిబ్బందికి కాసుల వర్షం కురుస్తుందన్న ఆరోపణలున్నాయి.  

విచారణ చేపట్టి  చర్యలు తీసుకుంటాం.. 

నాన్​ ట్రాన్స్ పోర్ట్ వాహనాల రిజిస్ట్రేషన్​ మార్పు ఆఫీస్​ ఏవో ఆధ్వర్యంలో జరుగుతాయి. టూ వీలర్​ రిజిస్ట్రేషన్​ మార్పుపై శనివారం ఫిర్యాదు అందింది. ఫిర్యాదు వచ్చిన రోజు ఏవో సెలవులో ఉన్నారు. సోమవారం(నేడు) పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత ఎక్కడ తప్పు జరిగిందనేది తేలుస్తాం. దాని తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. - వెంకట రమణ, ఇన్​చార్జి డీటీవో, ఖమ్మం 

నాకు తెలియకుండా రిజిస్ట్రేషన్​ చేశారు

నాది కామేపల్లి మండలం అడవి మద్దులపల్లి గ్రామం. ఖమ్మంలో మెకానిక్ తోటకూర వినోద్​ కు ఆర్నెళ్ల కింద రిపేర్​ కోసం సీడీ డీలక్స్​ బండి (టీఎస్​ 04ఈఏ 4405) ఇచ్చాను. అప్పటి నుంచి బండి తిరిగివ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఆరోగ్యం బాలేదని, ఆస్పత్రిలో ఉన్నానని చెప్పాడు. చివరకు నాకు తెలియకుండానే నా బండిని అమ్ముకున్నాడు. నా బండి ఒరిజినల్​ ఆర్సీ కార్డు నా దగ్గరే ఉంది. ఎటువంటి పేపర్లపై సంతకాలు కూడా చేయలేదు. 

ఆర్సీ కార్డు ఆన్ లైన్​ లో చెక్​ చేస్తే వేరొకరి పేరు మీద మార్చినట్లు ఉన్నది. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని జిల్లా రవాణాశాఖ  అధికారికి ఫిర్యాదు చేశాను. నా బండి  అక్రమ రిజిస్ట్రేషన్​కు   సహకరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరాను. - జాలె రవి, అడవి మద్దులపల్లి, కామేపల్లి మండలం