- నర్సింగ్ రిక్రూట్మెంట్లో ఆఫీసర్ల అక్రమాలు`
హైదరాబాద్, వెలుగు: సర్కార్ దవాఖాన్లలో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్సు పోస్టుల రిక్రూట్మెంట్లో అక్రమాలు జరిగినట్టు తెలుస్తోంది. డబ్బులు తీసుకొని ఆఫీసర్లు ఇష్టం వచ్చినట్లు వెయిటేజీ మార్కులు కలిపి అవినీతికి పాల్పడ్డారని స్టాఫ్ నర్సులు ఆరోపిస్తున్నారు. అనర్హులకు వెయిటేజీ మార్కులు కలిపారని, అర్హులకు కలపలేదని పలువురు నర్సులు హైదరాబాద్ కోఠిలోని పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఆఫీస్ ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. అక్రమాలపై కంప్లైంట్ చేయడానికి వస్తే ఆఫీసర్లు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3,311 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 2017 చివర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. సర్కార్ దవాఖాన్లలో ఇప్పటికే కాంట్రాక్ట్ బేసిస్పై పనిచేస్తున్న నర్సులకు వెయిటేజీ మార్కులు ఇవ్వనున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఒక్కో ఏడాది సర్వీస్కు 2 మార్కుల చొప్పున, అత్యధికంగా20 మార్కులు కలపాలని నిర్ణయించారు. నర్సింగ్ పూర్తి చేసినప్పటి నుంచి ఒక్కో ఏడాది ఎక్స్పీరియన్స్కు ఒక్కో మార్కు చొప్పున గరిష్టంగా పది మార్కులు కేటాయించాలని నిర్ణయించారు. ఈ 30 పోను, 70 మార్కులకు రాత పరీక్ష నిర్వహించారు. మొత్తం 21,391 మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాశారు.
కంప్లైంట్ చేస్తే తీసుకుంటలేరు
2018లోనే రాత ఎగ్జామ్ అయినా తరువాత, కోర్టు కేసులతో ఇన్నాళ్లుగా రిక్రూట్మెంట్ వాయిదా పడింది. ఇటీవల కోర్టు తీర్పు వెలువడడంతో శనివారం మెరిట్ లిస్ట్ రిలీజ్చేశారు. ఒక్కో అభ్యర్థికి రాత పరీక్ష, ఇతర అంశాల్లో కేటాయించిన మార్కుల లిస్ట్ను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టారు. ఇందులో అక్రమాలు జరిగాయని హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లోని సర్కార్దవాఖాన్లలో పనిచేస్తున్న నర్సులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్పై పనిచేసిన నర్సులకే వెయిటేజీ మార్కులు కలపాల్సి ఉండగా, అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్లకూ మార్కులు కలిపారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని దొంగ సర్టిఫికెట్లు సృష్టించి మార్కులు కలిపారని స్టాఫ్ నర్సులు చెప్తున్నారు. ఒకేసారి సర్వీస్లో చేరిన 30 మందిలో పది మందికి 20 చొప్పున మార్కులు కలిపారని, మిగిలిన 20 మందికి ఒక్క మార్కు కూడా కలపలేదని నీలోఫర్లో స్టాఫ్ నర్సుగా పనిచేస్తున్న మాధవి తెలిపారు. పన్నెండేండ్లుగా పనిచేస్తున్న తనకు ఒక్క మార్కు కూడా కలపలేదన్నారు. దీనిపై పబ్లిక్ హెల్త్ డైరెక్టరేట్ ఆఫీసర్లకు కంప్లైంట్చేయడానికి వెళ్తే నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్నప్పటికీ వెయిటేజీ మార్కులు కలపలేదని వరంగల్కు చెందిన స్టాఫ్ నర్సులు ఆవేదన వ్యక్తం చేశారు. హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్, ఉన్నతాధికారులు కలగజేసుకుని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
సరిచేసి ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తం
అప్లికేషన్ టైమ్ లో కేండిడేట్లు సమర్పించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ల ఆధారంగానే మార్కులు కలిపాం. సర్టిఫికెట్లు ఫేకా, ఒరిజినలా అన్నది అభ్యర్థులు పనిచేసిన హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, జిల్లాల డీఎంహెచ్వోలతో వెరిఫై చేశాం. ఫేక్ ఉంటే రిజెక్ట్ చేశాం. కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్స్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు, కొంతమంది ప్రభుత్వ దవాఖాన్లలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు పెట్టారు. అవి కూడా రిజెక్ట్ చేశాం. మరికొంతమంది సర్టిఫికెట్లు స్పష్టంగా లేవు. వాళ్లకు కూడా మార్కులు కలపలేదు. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉండి మార్కులు కలపకపోతే ఇప్పుడు కచ్చితంగా కలుపుతాం. అలాంటి వాళ్లు ఎవరైనా ఉంటే సంబంధిత సర్టిఫికెట్లు తీసుకొచ్చి మాకు ఇవ్వాలి. సర్టిఫికెట్లు పరిశీలించి కచ్చితంగా మార్కులు కేటాయిస్తాం. రూల్స్ కు విరుద్ధంగా కొంతమందికి మార్కులు యాడ్ అయినట్టు మా దృష్టికి వచ్చింది. అలాంటి వారు ఎవరెవరు ఉన్నారో పరిశీలిస్తున్నాం. వారందరి మార్కులు తొలగించి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తాం.
– అనితా గ్రేస్, డిప్యుటీ డైరెక్టర్,
పబ్లిక్హెల్త్ డిపార్ట్మెంట్ మంత్రి స్పందించాలె
నర్సింగ్ రిక్రూట్మెంట్లో జరిగిన అక్రమాలపై మంత్రి ఈటల రాజేందర్ స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని తెలంగాణ అవుట్ సోర్సింగ్ నర్సింగ్ స్టాఫ్ యూనియన్ ప్రెసిడెంట్ యం.నర్సింహ కోరారు. వెయిటేజీ మార్కులు కలపడంలో ఆరోగ్యశాఖ అధికారులు భారీగా అవతవకలకు పాల్పడ్డారని చెప్పారు. ఒకే హాస్పిటల్లో ఒకేసారి జాయిన్ అయి పనిచేస్తున్నవాళ్లలో కొంతమందికి మార్కులు కలిపి, మరికొంతమందికి కలపలేదన్నారు. డబ్బులు తీసుకుని ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లు సృష్టించారన్నారు. అక్రమాలపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు.
‑ అవుట్ సోర్సింగ్ నర్సింగ్ యూనియన్