
- 8 సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయిస్తాం: ఉత్తరాఖండ్ సీఎం ధామి
- బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ కోసం కేంద్రానికి విజ్ఞప్తి
- తక్షణ సాయం రూ. 1.5 లక్షలు.. ఇంటి రెంట్కు 5 వేలు
- రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు నిర్ణయాలు
న్యూఢిల్లీ/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణంలో నేల కుంగిపోయి, ఇండ్లకు బీటలు రావడానికి అక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) చేపట్టిన ప్రాజెక్టే కారణమా? ఆ ప్రాజెక్టు కోసం టన్నెల్ తవ్వడం కారణంగానే జోషిమఠ్లో ఇండ్లు, రోడ్లు దెబ్బతిన్నాయా? అనేది తేల్చేందుకు 8 సంస్థలతో ఇన్వెస్టిగేషన్ చేయించనున్నట్లు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి శుక్రవారం వెల్లడించారు. జోషిమఠ్ అంశంపై రాష్ట్ర కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మీటింగ్ అనంతరం ఆయన మీడియాకు వెల్లడించారు. జోషిమఠ్ పట్టణం కుంగిపోవడానికి గల కారణాలను గుర్తించడంతో పాటు అక్కడి కొండ ప్రాంతాలు ఎంత భారం మోయగలవన్న దానినీ చెక్ చేయనున్నట్లు తెలిపారు. జోషిమఠ్లో 700కుపైగా ఇండ్లకు, రెండు హోటళ్లకు బీటలు వచ్చాయని, ఇప్పటివరకూ 99 ఫ్యామిలీలను సేఫ్ ప్లేస్కు తరలించామన్నారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద రూ. 1.5 లక్షలు అందిస్తున్నామని, వారికి పునరావాసం కోసం చర్యలు తీసుకుంటున్నామని సీఎం వెల్లడించారు. జోషిమఠ్లో ఇండ్లను కూల్చివేయడంలేదని, ప్రమాదకరంగా ఒరిగిన రెండు హోటళ్లను మాత్రమే డిస్ మాంటిల్ చేస్తున్నామని చెప్పారు. బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ కోసం కేంద్రాన్ని సంప్రదిస్తామని తెలిపారు. అద్దె ఇండ్లలోకి మారిన కుటుంబాలకు నెలకు రూ. 5 వేల సాయం అందిస్తున్నామని, రీలొకేట్ అయిన ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపాధి హామీ స్కీంలో జాబ్స్ ఇస్తామన్నారు. బాధిత కుటుంబాలకు ఆరు నెలల పాటు కరెంట్, వాటర్ బిల్లులను మాఫీ చేస్తున్నామన్నారు. రాష్ట్ర మంత్రులంతా ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్కు ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చెప్పారు.
బీటలకు, టన్నెల్కు సంబంధంలేదు: ఎన్టీపీసీ
జోషిమఠ్ సమీపంలో తపోవన్ విష్ణుగడ్ హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్టు కోసం తవ్విన 12 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ కు, పట్టణంలోని ఇండ్లకు బీటలు రావడానికి సంబంధంలేదని ఎన్టీపీసీ ఇదివరకే నివేదిక పేర్కొంది. హైడ్రోఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం తవ్విన టన్నెల్ జోషిమఠ్ పట్టణానికి కిలోమీటర్ దూరంలో, ఉపరితలానికి కిలోమీటర్ దిగువన ఉందని తెలిపింది. టన్నెల్ తవ్వకంతో జోషిమఠ్లో నేల కుంగిపోయే చాన్స్ లేదని పేర్కొంది.
12 రోజుల్లోనే 5.4 సెం.మీ. కుంగింది: ఇస్రో
జోషిమఠ్ పట్టణం ల్యాండ్ స్లైడ్ మాది రిగా కుంగిపోతున్నదని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) వెల్లడించింది. పోయిన నెల 27 నుంచి ఈ నెల 8 వరకు12 రోజుల్లో పట్టణంలోని నేల 5.4 సెంటీమీటర్లు కుంగిపోయిందని రిపోర్ట్లో తెలిపిం ది. దీనికి సంబంధించి కార్టోశాట్ 2 ఎస్ ఉపగ్రహం తీసిన ఫొటోలను రిలీజ్ చేసింది. నిరుడు ఏప్రిల్, నవంబర్ మధ్య అక్కడి నేల 8.9 సెంటీ మీటర్లు కుంగిపోయిందని ఈ మేరకు హైదరాబాద్లోని ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ స్టడీలో వెల్లడైంది. జోషిమఠ్ ఔలీ రోడ్ దగ్గర్లో నేల కుంగుతున్న ప్రాంతానికి కేంద్రంగా ఉన్నట్లు ఇస్రో పేర్కొంది.
సుష్మా స్వరాజ్ పాత వీడియో వైరల్
ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లో 2013 జూన్ లో వరదలు వచ్చిన నేపథ్యంలో దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అప్పట్లో లోక్ సభలో ఇచ్చిన స్పీచ్ కు సంబంధించిన వీడియో తాజాగా జోషిమఠ్ కుంగిపోతున్న సందర్భంగా వైరల్ అవుతోంది. అభివృద్ధి పేరిట చేపడుతున్న పనుల వల్లే కేదార్ నాథ్ వరదలు వచ్చాయని, పర్యావరణాన్ని ధ్వంసం చేస్తే వినాశనం తప్పదని ఆ స్పీచ్ లో ఆమె స్పష్టం చేశారు. ‘‘ఎవరి కోసం మనం డెవలప్ మెంట్ చేస్తున్నాం? ఎవరి కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం? ఏదో ఒకరోజు ప్రకృతి కన్నెర్ర చేస్తుంది. అన్నింటినీ నాశనం చేస్తుంది. ఈ విపత్తు తర్వాతనైనా మనం కళ్లు తెరవకపోతే కష్టం..” అని నాటి స్పీచ్ లో ఆమె హెచ్చరించారు.