
- రైతు చట్టాలపై పోరాడితే ఖలిస్తానీలా?: కేసీఆర్
- రైతుల కోసం మాట్లాడే సీఎంలంటే కేంద్రానికి నచ్చదు
- అన్నదాతలు తలచుకుంటే ప్రభుత్వాలు పడిపోతయ్
- ఇప్పటికీ పోరాడి జీవితాలు త్యాగం చేయాల్సిన పరిస్థితేంది?
- నాకు కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్
- పంజాబ్ తరహా ఉద్యమాలు దేశమంతా రావాలి: సీఎం
- కేజ్రీవాల్తో కలిసి పంజాబ్ రైతు కుటుంబాలకు ఆర్థికసాయం
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దేశ ద్రోహులనే ముద్ర వేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ‘‘రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమించిన వారిని ఖలిస్తానీలని, దేశద్రోహులని.. ఇంకా ఏదేదో అన్నరు.. అవన్నీ దేశంలోని ప్రజలందరూ విన్నరు” అని అన్నారు. రైతు ఉద్యమాలను ఇదే పంథాలో కొనసాగించాలని రైతు నాయకులను ఆయన సూచించారు. ఢిల్లీలో జరిగిన రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు, గాల్వన్ లోయలో చైనా సైన్యం దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు ఆదివారం చండీగఢ్లోని ఠాగూర్ స్టేడియంలో కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు.
నలుగురు సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, 600 మంది రైతు కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులను ఢిల్లీ, పంజాబ్ సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ సింగ్తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం పాటుపడే, మాట్లాడే ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులంటే కేంద్రంలోని ప్రభుత్వానికి నచ్చదని, ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని రకరకాలుగా ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు. కేంద్రం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై పంజాబ్, హర్యానా నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి ఈ తరహా ఉద్యమం రావాలన్నారు. రైతులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయని పేర్కొన్నారు. ఇకపై నడిచే రైతు ఉద్యమాల్లో తాము అండగా ఉంటామని చెప్పారు. ఢిల్లీ సరిహద్దుల్లో సాగిన రైతు ఉద్యమానికి అరవింద్ కేజ్రీవాల్ తన వంతు సహాయ సహకారాలు అందజేశారని, ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను రక్షించే ప్రయత్నం చేశారని కేసీఆర్ తెలిపారు. ఈ ఉద్యమంలో ఎందరో రైతులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు.
కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నయ్
స్వాతంత్య్రం కోసం పంజాబ్ యోధులు చేసిన త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని, పంజాబ్ రైతులు చమట చిందించి దేశానికి అన్నం పెట్టారని, దీనిని దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిందేనని కేసీఆర్ తెలిపారు. రైతుల ప్రాణాలను తిరిగి తీసుకురాలేమని, కొన్ని మంచి మాటలు చెప్పి వారి కుటుంబాల మనుసులు శాంత పరిచేందుకే ఇక్కడి వరకు వచ్చామన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 75 ఏండ్ల తర్వాత కూడా ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నామంటే కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికీ ప్రజలు పోరాడి జీవితాలు త్యాగం చేయాల్సిన నిస్సహాయత ఏమిటన్నారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రాణాలు కోల్పోయిన ప్రతి కుటుంబానికి తాను తలవంచి నమస్కరిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. గాల్వన్ లోయలో కల్నల్ సంతోష్బాబుతో పాటు అమరులైన పంజాబ్ సైనికులకు అప్పుడే వచ్చి ఆదుకుందామని అనుకున్నామని, ఆ సమయంలో ఇక్కడ ఎన్నికలు ఉండటంతో రాలేకపోయానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత భగవంతుడి దయతో కరెంట్ సమస్య అధిగమించామని, వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. రైతుల కోసం తాము ఇంత చేస్తుంటే ఢిల్లీలో మన తలపై కూర్చున్న ప్రభుత్వం మీటర్లు పెట్టాలని పట్టుబడుతున్నదని మండిపడ్డారు. ‘‘ప్రాణం పోయినా మేం మీటర్లు పెట్టబోమని అసెంబ్లీ సాక్షిగా తేల్చిచెప్పినం.. ఏం చేసుకోవాలని అనుకుంటే అది చేసుకోండి అని తెగేసి చెప్పినం” అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రైతులను కట్టడి చేయాలని కేంద్రం చెప్పింది: కేజ్రీవాల్
రైతు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా, ఇతర రాష్ట్రాల రైతులు ఏడాదికిపైగా ఉద్యమించారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అన్నారు. ‘‘ఉద్యమంలో పాల్గొంటున్న రైతులను కట్టడి చేయాలని, నిర్బంధించాలని కేంద్రం మమ్మల్ని ఆదేశించింది. రైతు ఉద్యమాలు చేస్తున్న వారిని నిర్బంధించడానికి ఢిల్లీలోని అన్ని స్టేడియంలను జైళ్లలా మార్చాలని మాపై ఒత్తిడి తెచ్చింది. అయినా మేము రైతులకే అండగా నిలిచాం” అని అన్నారు.