ముంబై: లఖీంపూర్ ఘటనపై మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివ సేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ ఘటన విషయంలో కేంద్రం, యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. బాధిత అన్నదాతల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను అడ్డుకోవడం సమంజసం కాదన్నారు.
‘లఖీంపూర్లో సెక్షన్ 144 పెట్టి అక్కడికి వెళ్తున్న రాజకీయ నేతల్ని లక్నోలోనే అరెస్ట్ చేస్తున్నారు. ఇదేం చట్టం? ఉత్తర్ ప్రదేశ్ ఏమైనా పాకిస్థాన్లో ఉందా? అక్కడికి వెళ్తున్న నాయకుల్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? మన దేశంలో ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లేందుకు కొత్త రూల్స్ పెట్టారా? ఇది కొత్త లాక్డౌనా ఏంటి? బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రియాంకా గాంధీని హౌస్ అరెస్ట్ చేశారు. రాహుల్ గాంధీని కూడా అరెస్ట్ చేశారు. ఓ రాష్ట్ర సీఎంను కూడా అడ్డుకున్నారు. వాళ్లేం తప్పు చేశారో చెప్పండి? మన దేశంలో కొత్త రాజ్యాంగం ఏమైనా తీసుకొచ్చారా? ప్రభుత్వ అధికారులు కూడా పంజరంలోని చిలకలా అధికార పార్టీ ఆదేశాలను మౌనంగా పాటిస్తున్నారు’ అని సంజయ్ రౌత్ పేర్కొన్నారు.