ఆ తర్వాత ఎవరూ పట్టించుకుంటలేరు
కొంగోడు గ్రామంలో ఏడుగురి ఆందోళన
మెదక్, వెలుగు : కరోనా సోకిందేమో అనే అనుమానంతో ఏడుగురిని ఐసోలేషన్లో ఉంచారు మెదక్ జిల్లా కొల్చారం మండలం కొంగోడు గ్రామస్తులు. కానీ ఆ తర్వాత ఎవరూ వారి గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఐసోలేషన్లో ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో అనసూయ అనే మహిళ కరోనాతో 21వ తేదీన చనిపోయింది. అయితే అంత్యక్రియలు పూర్తయ్యాక ఆమెకు కరోనా అని తేలింది. అంత్యక్రియల్లో వివిధ పనులు చేసిన దుబ్బగల్లస్వామి, దుబ్బగల్ల రత్నయ్య, స్వామి, దుబ్బగల్ల భాస్కర్, దుబ్బగల్ల దేవయ్య, సాలె లక్ష్మయ్య, పోచమ్మను గ్రామ శివారులోని స్కూల్లో ఉంచారు.
ఇందులో దుబ్బగల్ల స్వామికి ఆదివారం వాంతులు, విరేచనాలు కావడంతో అస్వస్థతకు గురయ్యాడు. మెడిసిన్ ఇచ్చే వారు కూడా లేరు. రెండు రోజులుగా తమకు సరైన ఆహారం కూడా లేదని, గ్రామ పెద్దలు, వైద్య సిబ్బంది ఎవరూ పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరు సిక్ అవడంతో తమ పరిస్థితి ఏంటని మిగతావారు వాపోతున్నారు. ఆఫీసర్లు స్పందించి
తమకు మంచి ఆహారం అందించాలని, స్వామికి ట్రీట్మెంట్ చేయించాలని కోరుతున్నారు.