న్యూఢిల్లీ: జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లను మేలుకొలిపే ప్రక్రియను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 22న చంద్రుడిపై సూర్యోదయం అవుతుందని, ఆ తర్వాత ల్యాండర్, రోవర్ లను తిరిగి యాక్టివ్ చేస్తామని ఇస్రో సైంటిస్టులు గతంలో వెల్లడించారు.
అయితే, అనుకోని కారణాల వల్ల ఈ ప్రాసెస్ ను శనివారానికి వాయిదా వేయాల్సి వచ్చిందని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్ దేశాయ్ వివరించారు. చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న విజయవంతంగా జాబిల్లిపై దిగింది. ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి పలు పరిశోధనలను పూర్తిచేసింది. ఈలోగా చంద్రుడిపై సూర్యాస్తమయం కావడంతో విక్రమ్, ప్రజ్ఞాన్లను ఇస్రో సైంటిస్టులు స్లీపింగ్ మోడ్లోకి పంపించారు. 14 రోజుల తర్వాత తిరిగి చంద్రుడిపై సూర్యోదయం కాగానే వీటిని యాక్టివ్ చేసేందుకు ప్లాన్ చేశారు.