భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని దాటింది. మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్ గగన్యాన్లో కీలక అడుగు పడింది. ప్రాజెక్టు గగన్ యాన్ మిషన్ కోసం రూపొందిస్తున్న క్రూ ఎస్కేప్ సిస్టమ్ కు సంబంధించిన లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. నెల్లూరులోని శ్రీహరికోటలో ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది.
క్రూ ఎస్కేప్ మిషన్.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు గగన్యాన్ మిషన్లోని క్రూ మాడ్యూల్ను వేరు చేస్తుంది. దీంతో వ్యోమగాములు సురక్షితంగా బయటపడతారని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం వెల్లడించింది.అలాగే రాకెట్ ప్రారంభం దశలో మిషన్ ఆగిపోయిన సమయంలో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ ..సీఎఈఎస్ కు అవసరమైన థ్రస్ట్ ను అందిస్తుంది.
మోటారు బాలిస్టిక్ పరిమమితులు అంచనా వేయడం.. సబ్ సిస్టమ్ పనితీరు ధృవీకరించడం, డిజైన్ మార్జిన్లను నిర్థారించడం, నాజిల్ లైనర్ల ఉష్ణ పనితీరును అంచనా వేయడంతో పాటు ఇతర సమగ్ర వివరాలను అంచనా వేయడానికి పరీక్షలను పూర్తి చేశారు.
తక్కువ- భూ కక్ష్యకు మానవ అంతరిక్ష యాత్రలను చేపట్టేందుకు, స్వదేశీ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు గగన్యాన్ ప్రోగ్రామ్ ను ఇస్రో చేపట్టబోతుంది. గగన్యాన్ ప్రోగ్రామ్ లో భాగంగా మూడు విమానాలు లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపిస్తారు. వీటిలో రెండు మానవరహిత విమానాలు, ఒకటి మానవ సహిత పయనం.
గగన్యాన్ 1
గగన్యాన్ ప్రోగ్రామ్ భారత మొట్టమొదటి మానవసహిత అంతరిక్ష యాత్ర. ఈ మిషన్లో భాగంగా తక్కువ భూ కక్ష్యలోకి మనుషులను పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది.
రెండు టెస్ట్ ఫ్లైట్లలో గగన్యాన్ 1 మొదటిది. ముగ్గురు వ్యక్తులను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న అంతరిక్ష నౌకను 2022 చివరిలో అంతరిక్షంలోకి పంపాలని భావిస్తున్నారు.
గగన్యాన్ 2
గగన్యాన్ రెండవ అన్క్రూడ్ మిషన్ 2022 చివరిలో ఇస్రో ప్రయోగించనుంది. ఈ పరీక్షలో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు.. మనిషిలాగే ప్రవర్తించే హాఫ్ హ్యూమనాయిడ్ రోబో 'వ్యోమ మిత్ర'ను రూపొందిస్తోంది. వ్యోమమిత్రను పరీక్షించిన ఆరునెలల అనంతరం మరోమారు మానవ రహిత గగన్యాన్ ప్రయోగం చేపట్టనుంది. మానవసహిత అంతరిక్ష యాత్ర చేపట్టే ముందు అంతరిక్ష నౌక వ్యవస్థలను అధ్యయనం చేయడం ఈ మిషన్ లక్ష్యం.