న్యూఢిల్లీ: నావిగేషనల్ శాటిలైట్ ఎన్వీఎస్ 1ను ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) సోమవారం ప్రయోగించనుంది. నావిగేషన్ సామర్థ్యాన్ని పెంచేందుకు చేపట్టిన ప్రయోగంలో భాగంగాఈ ఉపగ్రహాన్ని పంపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. గ్రౌండ్ స్టేషన్లతో అనుసంధానమై కక్ష్యలో తిరిగే ఏడు ఉపగ్రహాల సమూహమే నావిక్(నావిగేషన్ విత్ ఇండియన్ కన్స్టె లేషన్). ఈ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టంను ఇస్రో అభివృద్ధి చేసింది.
సాయుధ బలగాలతో పాటు సాధారణ యూజర్లకూ ఈ నెట్ వర్క్ నావిగేషన్ సేవలు అందిస్తుంది. దేశంలో పౌర విమానయాన రంగంలో పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకొని నావిక్ సిస్టంను అభివృద్ధి చేశారు. రెండోతరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్లో ఎన్వీఎస్–1 మొదటిది. ఉదయం 10.30 గంటలకు శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ రాకెట్ ఈ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లనుంది.