డివైడర్ ను ఢీకొని ఐటీ ఉద్యోగి.. తుర్కయాంజల్ మాసబ్ చెరువు కట్టపై ఘటన

డివైడర్ ను ఢీకొని ఐటీ ఉద్యోగి.. తుర్కయాంజల్ మాసబ్ చెరువు కట్టపై ఘటన

ఇబ్రహీంపట్నం : స్నేహితుడి వద్దకు వెళ్లి తిరిగివస్తున్న నలుగురు సాఫ్ట్​వేర్​ఇంజినీర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరి కారు డివైడర్​ను ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆదిభట్ల ఎస్సై సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన పత్తి నారాయణస్వామి(31), మధుకుమార్​రెడ్డి, విజయ్​కుమార్, వంశీకృష్ణ స్నేహితులు. నారాయణస్వామి దొనకొండలోనే ఉంటుండగా.. మిగతావారు అల్మాస్​గూడలో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. శనివారం సాయంత్రం నారాయణస్వామి అల్మాస్​గూడకు రాగా.. అందరూ కలిసి కారులో ఇబ్రహీంపట్నంలో ఉండే స్నేహితుడి వద్దకు వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున బీఎన్.రెడ్డి నగర్​పైపు వెళ్తున్నారు.

 రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మాసబ్​ చెరువు కట్టపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకుమార్​రెడ్డి, విజయ్​కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. వంశీకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మధుకుమార్​రెడ్డి, విజయ్​కుమార్ పరిస్థితి సీరియస్​గా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. వారు బీఎన్.రెడ్డి నగర్​లోని ఓ ప్రైవేట్​హాస్పిటల్​లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కేసు దర్యాప్తు  చేస్తున్నట్లు పేర్కొన్నారు.