
షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల అప్పు చెల్లింపు
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన షార్ట్సెల్లింగ్ ఫర్మ్ హిండెన్బర్గ్ రిపోర్ట్ కారణంగా నష్టపోయిన అదానీ గ్రూప్ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని తిరిగి సాధించడానికి మరో అప్పును ముందుగానే చెల్లించింది. రూ.7,374 కోట్ల విలువైన షేర్ బ్యాక్డ్ ఫైనాన్సింగ్ను ముందస్తుగానే చెల్లించామని ప్రకటించింది. వీటి చెల్లింపునకు 2025 ఏప్రిల్ వరకు గడవు ఉంది. ఈ నిర్ణయం ద్వారా తమ కంపెనీల ఆర్థిక పరిస్థితి బాగానే ఉందనే ఇండికేషన్స్ను ఇన్వెస్టర్లకు పంపించింది. అప్పుల చెల్లింపు ద్వారా అదానీ లిస్టెస్ట్ కంపెనీల తనఖా షేర్లు తిరిగి కంపెనీ చేతుల్లోకి వచ్చాయి.
వీటిలో- అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్కు చెందిన 155 మిలియన్ షేర్లు ప్రమోటర్ల హోల్డింగ్లో 11.8శాతం ఉండగా, - అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్కు చెందిన 31 మిలియన్ షేర్లు, ప్రమోటర్ల హోల్డింగ్లో 4 శాతం ఉన్నాయి. - అదానీ ట్రాన్స్మిషన్ లిమిటెడ్కు చెందిన 36 మిలియన్ షేర్లు, ప్రమోటర్ల హోల్డింగ్లో 4.5శాతం ఉన్నాయి. - అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్కు చెందిన 11 మిలియన్ షేర్లు, ప్రమోటర్ల హోల్డింగ్లో 1.2శాతం ఉన్నాయి. "ఫిబ్రవరి నెలలో ముందుగా చేసిన రీపేమెంట్లతో పాటు, 2,016 మిలియన్ల షేర్ బ్యాక్డ్ ఫైనాన్సింగ్ను ముందస్తుగానే చెల్లించాం. 2023 మార్చి 31లోపు అన్ని షేర్ బ్యాక్డ్ ఫైనాన్సింగ్లను ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించాం’’ గ్రూప్ తెలిపింది.
ఇదిలా ఉంటే, అదానీకి చెందిన ఎనిమిది లిస్టెడ్ సంస్థల స్టాక్లు సోమవారం లాభాలతో ముగిశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ ఐదు శాతానికి పైగా పెరిగింది. పోయిన వారం, గ్రూప్ తన లిస్టెడ్ కంపెనీలలో నాలుగు మైనారిటీ వాటాలను అమెరికా ఆధారిత బోటిక్ సంస్థ జీక్యూజీ పార్టనర్స్కు రూ.15,446 కోట్లకు అమ్మేయడంతో అన్ని లిస్టెడ్ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. జీక్యూజీ కూడా కేవలం రెండు సెషన్లలో అదానీ షేర్ల ర్యాలీ కారణంగా రూ.మూడు వేల కోట్లకు పైగా సంపాదించింది.