శ్రీనగర్: ఆర్టికల్ 370 రద్దును ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాలు చేయడం తప్పే అని, అలా చేసుండకపోయినా కాశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీల పరిస్థితి అధ్వానంగా ఉండేదని పీపుల్స్ కాన్ఫరెన్స్ చీఫ్ సాజద్ లోన్ అభిప్రాయపడ్డారు. శనివారం ఓ వార్తా సంస్థతో ఆయన మాట్లాడారు. ఆర్టికల్ 370 రద్దుకు కాశ్మీర్లో ప్రధాన రాజకీయ పార్టీలు దూరంగా ఉండుంటే, ఆ అంశాన్ని కోర్టులో సవాలు చేసేందుకు ఎవరికైనా కేంద్ర ప్రభుత్వం సహకరించి ఉండేదని ఆయన చెప్పారు. ‘‘ఆ రోజు (2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దుచేయడం) జరిగిన పరిణామాల నేపథ్యంలో ఈరోజు ఆ అంశం ప్రాధాన్యాన్ని సంతరించుకొంది.
ఆ విషయం నాకు తెలుసు. జమ్మూకాశ్మీర్ ప్రజల గొంతు పార్లమెంటులో వినపడాలన్నదే నా అభిమతం. ఎందుకంటే 2019 తర్వాత జరిగిన పరిణామాలను గమనిస్తే కాశ్మీర్ ప్రజల తరపున పార్లమెంటులో మాట్లాడడం ఎంత ప్రధానమో తెలుస్తుంది. ఈ లోక్ సభ ఎన్నికల్లో నేను గెలిస్తే, కచ్చితంగా కాశ్మీరీల గొంతును లోక్ సభలో వినిపిస్తా” అని సాజద్ పేర్కొన్నారు. కాగా, ఈ లోక్ సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. అదే సీటులో కాశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్ సీ) లీడర్ ఒమర్ అబ్దుల్లా పోటీచేస్తున్నారు.
370ని మళ్లీ తెస్తామంటూ ఎన్సీ అబద్ధాలు..
కాశ్మీర్లో తమను గెలిపిస్తే, కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన ఆర్టికల్ 370ని మళ్లీ తెస్తామని ఎన్ సీ లీడర్లు అబద్ధాలు చెబుతూ ప్రజలను మూర్ఖులను చేసే ప్రయత్నం చేస్తున్నారని సాజద్ లోన్ విమర్శించారు. 370ని ఎలా తెస్తారో వారు చెప్పడంలేదని ఆయన మండిపడ్డారు. ‘‘కాశ్మీర్లో మూడు సీట్లు ఉన్నాయి. ఆ మూడింట్లో గెలిచినా ఆర్టికల్ 370ని మళ్లీ ఎలా తేగలరు? లోక్ సభలో పెద్ద మార్పులు చేయాలంటే ఒక పార్టీకి మూడింట రెండొంతుల మెజారిటీ కావాలి. ఇండియా కూటమిలో ఎన్సీ భాగంగా ఉంది. లోక్ సభలో మూడింట రెండు వంతుల మెజారిటీ వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని కూటమి నేతలతో ప్రకటన ఇప్పిస్తే తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటా” అని సాజద్ చెప్పారు.