రోమ్: ఇటలీ ప్రధాన మంత్రి మారియో డ్రాఘి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీలు తమ సపోర్టును ఉపసంహరించుకోవడంతో మారియో రిజైన్ చేశారు. తన రాజీనామా లేఖను ప్రెసిడెంట్ సెర్గియో మట్టరెల్లాకు అందజేశారు. దీంతో అధ్యక్షుడు పార్లమెంటును రద్దుచేసి ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని సూచించవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటిదాకా డ్రాఘి ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగవచ్చు. యూరోపియన్ సెంట్రల్బ్యాంక్ మాజీ హెడ్గా కూడా పనిచేసిన డ్రాఘి 2021 ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే దేశం కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. విభేదాలను పక్కకు పెట్టి ప్రభుత్వం కొనసాగేందుకు సహకరించాలని కూటమిలోని పార్టీలకు ఆయన విజ్ఞప్తి చేసినా ఆ పార్టీలు వినిపించుకోలేదు. దీంతో డ్రాఘి రాజీనామా చేయాల్సి వచ్చింది.