
- రూ.2.75 స్పెషల్ డివిడెండ్ కూడా
- ఈ నెల 30 రికార్డ్ డేట్
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ కంపెనీ ఐటీసీకి ఈ ఏడాది మార్చితో ముగిసిన క్వార్టర్ (క్యూ4 ) లో రూ. 5,225.02 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) వచ్చింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ. 4,259.68 కోట్ల లాభాన్ని ప్రకటించింది. రిజల్ట్స్ నేపథ్యంలో కంపెనీ షేర్లు గురువారం 2 శాతం నష్టపోయి రూ.419 వద్ద క్లోజయ్యాయి. ఐటీసీకి కార్యకలాపాల ద్వారా రూ. 19,058.29 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఇది ఏడాది ప్రాతిపదికన 7 శాతం గ్రోత్కు సమానం. షేరుకి రూ.6.75 ఫైనల్ డివిడెండ్ను, రూ.2.75 స్పెషల్ డివిడెండ్ను ఇచ్చేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకోసం ఈ నెల 30 వ తేదీని రికార్డ్ డేట్గా ఫిక్స్ చేసింది. ఆగస్ట్ 14–17 మధ్య డివిడెండ్ పే చేయనుంది. తాజాగా ప్రకటించిన డివిడెండ్తో కూడా కలుపుకుంటే మొత్తం 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను షేరుకి రూ.15.50 కంపెనీ ఇచ్చింది. సెగ్మెంట్ పరంగా చూస్తే, సిగరెట్స్ బిజినెస్ నుంచి వచ్చిన రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 13 శాతం పెరిగి రూ.8,082 కోట్లకు చేరుకుంది. ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ రెవెన్యూ 19 శాతం పెరిగి రూ.4,951 కోట్లకు ఎగిసింది. అగ్రీ బిజినెస్ రెవెన్యూ మాత్రం 17 శాతం తగ్గి రూ.3,607 కోట్లుగా రికార్డయ్యింది.