- షేరుకి రూ.7.50 డివిడెండ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చి క్వార్టర్ (క్యూ4) లో ప్రాఫిట్ కొద్దిగా తగ్గిందని ఐటీసీ ప్రకటించింది. కిందటేడాది మార్చి క్వార్టర్లో రూ.5,242.59 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్) సాధించిన కంపెనీకి క్యూ4 లో రూ.5,190.71 కోట్లు వచ్చాయి. రెవెన్యూ రూ.19,058.29 కోట్ల నుంచి రూ.19,446.49 కోట్లకు పెరిగింది. ఐటీసీ మొత్తం ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 3 శాతం పెరిగి రూ.13,294.30 కోట్లకు చేరుకున్నాయి.
కంపెనీ మొత్తం ఆదాయం క్యూ4 లో రూ.20,130.32 కోట్లుగా ఉంది. ఒక్కో షేరుకి రూ.7.50 ఫైనల్ డివిడెండ్ ఇవ్వాలని ఐటీసీ బోర్డ్ నిర్ణయించింది. 2023–24 ఆర్థిక సంవత్సరానికిగాను ఇప్పటికే ఒక్కో షేరుకి రూ.6.25 ఇంటెరిమ్ డివిడెండ్ను కంపెనీ ఇచ్చింది. తాజాగా ప్రకటించిన డివిడెండ్ను కలుపుకుంటే కిందటి ఆర్థిక సంవత్సరానికి గాను ఒక్కో షేరుకి రూ.13.75 డివిడెండ్ ఇచ్చినట్టు. ఐటీసీ షేర్లు గురువారం 0.80 శాతం పెరిగి రూ.443.25 దగ్గర క్లోజయ్యాయి.
ఐటీసీ హోటల్స్ డీమెర్జర్పై జూన్ 6 న మీటింగ్
హోటల్స్ బిజినెస్ను సపరేట్ చేయడంపై వచ్చే నెల 6 న షేర్ హోల్డర్ల మీటింగ్ పెట్టుకోవడానికి ఐటీసీకి ఎన్సీఎల్టీ అనుమతి ఇచ్చింది. కంపెనీ ఇప్పటికే స్టాక్ ఎక్స్చేంజ్ల నుంచి అనుమతులు పొందింది. హోటల్స్ బిజినెస్ను డీమెర్జ్ చేయడానికి, వీటి షేర్లు మార్కెట్లో లిస్ట్ చేయడానికి కిందటేడాది ఆగస్టులో ఐటీసీ బోర్డ్ ఆమోదం తెలిపింది.
