సర్వే దాటని చెంచుల సంక్షేమం.. అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు

సర్వే దాటని  చెంచుల సంక్షేమం.. అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
  • నామ్​కే వాస్తేగా మారిన మన్ననూర్​ ఐటీడీఏ 
  • అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
  • పత్తాలేని అవగాహన సదస్సులు

నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల అటవీప్రాంతంలోని చెంచులు, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు సర్వే దశ దాటడం లేదు. ఆదివాసీల అభివృద్ధి కోసం పథకాలను అమలు చేయాల్సిన మన్ననూరు ఐటీడీఏ నామ్​కే వాస్తేగా మారింది. ఐటీడీఏలో 14 ఏండ్లుగా రెగ్యులర్​ మేనేజర్​ మాత్రమే ఉండడంతో ఎలాంటి పనులు జరగడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఐటీడీఏకు రెగ్యులర్​ పీవో, ఉద్యోగులను నియమించకపోవడంతో ప్రభుత్వ పథకాలేవీ అమలుకు నోచుకోవడం లేదు.

నల్లమల చెంచులు, ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా కేంద్రం ఏడాది కింద ప్రకటించిన పీఎం జన్​మన్​ యోజన ముందుకు పడడం లేదు. పక్కా ఇండ్లు, తాగునీటి వసతి, సోలార్​ విద్యుత్, స్వయం ఉపాధి వంటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. రక్త హీనత బారిన పడిన వారికి సరైన వైద్యం, ఆహారం కూడా అందని పరిస్థితి ఉంది. చెంచులందరికీ ఆధార్, రేషన్, ఈజీఎస్​ జాబ్​కార్డులు కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో ఏ పథకం అమలు కావడం లేదు. 

అవగాహన సదస్సులు నిర్వహించట్లే..

చెంచు పెంటల్లో పక్కా గృహాలు, విద్యుత్, తాగునీరు. ఆరోగ్య మిషన్​ కింద సంచార వైద్య శాలలు, అటవీ హక్కు చట్టం, గ్రామ సడక్​ యోజన, సికిల్​ సెల్​ అనీమియా, అంగన్​వాడీ కేంద్రాల ఏర్పాటు, మత్స్య సంపద, జలజీవన్​ మిషన్, జన ఆరోగ్య యోజన, సమగ్ర శిశు అభ్యాస్, దూర సంచార వికాస్​ నిధి, నైపుణ్య భారత మిషన్, స్వదేశీ దర్శన్​ వంటి పథకాలపై ఈ నెల 15 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంది.

అయితే ఎక్కడా వీటిని ఏర్పాటు చేయడం లేదు. చెంచులకు ఆధార్​ కార్డులు, కుల దృవీకరణ సర్టిఫికెట్లు, రేషన్​ కార్డులు, బ్యాంక్​ అకౌంట్లు అందించాలని కేంద్రం నిర్దేశించింది. ఇందుకోసం పీఎం జన్​మన్​ యోజన కింద భారీగా నిధులు కేటాయించింది. అయితే ఈ పథకాన్ని ఎవరు ఇంప్లిమెంట్​ చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఏడాదిగా ముందుడుగు పడడం లేదు.

పాత లెక్కలే దిక్కు..

 ప్రకారం చెంచులు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని మాత్రమే ఆఫీసర్లు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 8 మండలాల్లోని 88 చెంచు పెంటల్లో 8,772 చెంచు ఫ్యామిలీలకు పీఎం ఆవాస్​ యోజన కింద 890 ఇండ్లు మంజూరు​చేశారు. ఇవి మంజూరై ఏడాది కావస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ఇటీవల నల్లమలలో పర్యటించిన బ్రాక్ -యూపీఎన్ఆర్ఎం టీమ్​ అమ్రాబాద్, పదర మండలాల్లోని మల్లయ్యపెంట, చౌటిగూడెంలో పర్యటించి చెంచులతో సమావేశమయ్యారు. 15 గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉన్న 440  చెంచు కుటుంబాల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు. స్పెషల్​ డ్రైవ్​ నిర్వహించి ఆధార్, రేషన్, ఈజీఎస్​ జాబ్​ కార్డులు అందించాలని సూచించారు. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

ఐటీడీఏతోనే అసలు సమస్య..

నల్లమల అటవీ ప్రాంతంలో  నివసించే పీవీటీజీ(పర్టికులర్లీ వల్నరబుల్​ ట్రైబల్​ గ్రూప్)గా గుర్తించిన చెంచుల అభివృద్ధి, సంక్షేమం, జీవనోపాధులు, వ్యవసాయం, పండ్లతోటలు, పశు పోషణ, విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఇతర కనీస అవసరాలు కల్పించేందుకు మన్ననూర్​లో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్​లో 14 ఏండ్లుగా ఒకే రెగ్యులర్​ ఉద్యోగి పని చేస్తున్నారు. మన్ననూర్​ ఐటీడీఏ పరిధిలో నాగర్​ కర్నూల్, మహబూబ్​నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలను చేర్చారు.

100 గ్రామ పంచాయితీల పరిధిలో 172  చెంచు పెంటలు ఉన్నాయి. నాగర్​ కర్నూల్​ జిల్లాలోనే 80 చెంచు పెంటలు ఉన్నాయి. ఇన్​చార్జి పీవో, మరో ముగ్గురు కాంట్రాక్ట్  ఉద్యోగులతో ఐటీడీఏ పని చేస్తోంది. ఆదివాసీల సంక్షేమం కోసం నిధులు కేటాయింపు, వినియోగం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో మన్ననూర్​ ఐటీడీఏ అలంకారప్రాయంగా మారింది. వివిధ పథకాల అమలు చేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న  సమాచారం అందజేసి మిన్నకుంటున్నారని 
అంటున్నారు.

ఏ పథకం అమలు కావట్లే..

చెంచులకు మంజూరైన 890 పక్కా గృహాల వెరిఫికేషన్​  కొనసాగుతోంది. పెట్రాల్​ చేను, ఎర్రపెంటకు రూ.1.20 కోట్లతో కమ్యూనిటీ హాల్స్​ మంజూరయ్యాయి. రూ.6 కోట్లతో మిషన్​ భగీరథ కింద పైప్​లైన్లు, వాటర్​ ట్యాంకుల నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. వైద్య సేవలు అందించేందుకు మంజూరైన ఆరు మొబైల్​ మెడికల్​ యూనిట్లలో ఒకటి పని చేస్తోంది. 100 కుటుంబాలకో మినీ అంగన్​వాడీ సెంటర్  ఏర్పాటు అమలు కావడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర పథకాలను ఇంప్లిమెంట్​ చేసి చెంచుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.