
- నామ్కే వాస్తేగా మారిన మన్ననూర్ ఐటీడీఏ
- అందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు
- పత్తాలేని అవగాహన సదస్సులు
నాగర్ కర్నూల్, వెలుగు: నల్లమల అటవీప్రాంతంలోని చెంచులు, గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు సర్వే దశ దాటడం లేదు. ఆదివాసీల అభివృద్ధి కోసం పథకాలను అమలు చేయాల్సిన మన్ననూరు ఐటీడీఏ నామ్కే వాస్తేగా మారింది. ఐటీడీఏలో 14 ఏండ్లుగా రెగ్యులర్ మేనేజర్ మాత్రమే ఉండడంతో ఎలాంటి పనులు జరగడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ఐటీడీఏకు రెగ్యులర్ పీవో, ఉద్యోగులను నియమించకపోవడంతో ప్రభుత్వ పథకాలేవీ అమలుకు నోచుకోవడం లేదు.
నల్లమల చెంచులు, ఆదివాసీల అభివృద్ధిలో భాగంగా కేంద్రం ఏడాది కింద ప్రకటించిన పీఎం జన్మన్ యోజన ముందుకు పడడం లేదు. పక్కా ఇండ్లు, తాగునీటి వసతి, సోలార్ విద్యుత్, స్వయం ఉపాధి వంటి పథకాలు అమలుకు నోచుకోవడం లేదని వాపోతున్నారు. రక్త హీనత బారిన పడిన వారికి సరైన వైద్యం, ఆహారం కూడా అందని పరిస్థితి ఉంది. చెంచులందరికీ ఆధార్, రేషన్, ఈజీఎస్ జాబ్కార్డులు కూడా అందని పరిస్థితి ఉంది. దీంతో ఏ పథకం అమలు కావడం లేదు.
అవగాహన సదస్సులు నిర్వహించట్లే..
చెంచు పెంటల్లో పక్కా గృహాలు, విద్యుత్, తాగునీరు. ఆరోగ్య మిషన్ కింద సంచార వైద్య శాలలు, అటవీ హక్కు చట్టం, గ్రామ సడక్ యోజన, సికిల్ సెల్ అనీమియా, అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటు, మత్స్య సంపద, జలజీవన్ మిషన్, జన ఆరోగ్య యోజన, సమగ్ర శిశు అభ్యాస్, దూర సంచార వికాస్ నిధి, నైపుణ్య భారత మిషన్, స్వదేశీ దర్శన్ వంటి పథకాలపై ఈ నెల 15 నుంచి 30 వరకు అవగాహన సదస్సులు నిర్వహించాల్సి ఉంది.
అయితే ఎక్కడా వీటిని ఏర్పాటు చేయడం లేదు. చెంచులకు ఆధార్ కార్డులు, కుల దృవీకరణ సర్టిఫికెట్లు, రేషన్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు అందించాలని కేంద్రం నిర్దేశించింది. ఇందుకోసం పీఎం జన్మన్ యోజన కింద భారీగా నిధులు కేటాయించింది. అయితే ఈ పథకాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయాలనే విషయంపై క్లారిటీ లేకపోవడంతో ఏడాదిగా ముందుడుగు పడడం లేదు.
పాత లెక్కలే దిక్కు..
ప్రకారం చెంచులు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని మాత్రమే ఆఫీసర్లు చెబుతున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని 8 మండలాల్లోని 88 చెంచు పెంటల్లో 8,772 చెంచు ఫ్యామిలీలకు పీఎం ఆవాస్ యోజన కింద 890 ఇండ్లు మంజూరుచేశారు. ఇవి మంజూరై ఏడాది కావస్తున్నా లబ్ధిదారుల ఎంపిక పూర్తి కాలేదు. ఇటీవల నల్లమలలో పర్యటించిన బ్రాక్ -యూపీఎన్ఆర్ఎం టీమ్ అమ్రాబాద్, పదర మండలాల్లోని మల్లయ్యపెంట, చౌటిగూడెంలో పర్యటించి చెంచులతో సమావేశమయ్యారు. 15 గ్రామాల్లో అత్యంత పేదరికంలో ఉన్న 440 చెంచు కుటుంబాల గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆధార్, రేషన్, ఈజీఎస్ జాబ్ కార్డులు అందించాలని సూచించారు. అయితే ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.
ఐటీడీఏతోనే అసలు సమస్య..
నల్లమల అటవీ ప్రాంతంలో నివసించే పీవీటీజీ(పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్)గా గుర్తించిన చెంచుల అభివృద్ధి, సంక్షేమం, జీవనోపాధులు, వ్యవసాయం, పండ్లతోటలు, పశు పోషణ, విద్య, వైద్యం, తాగునీరు, విద్యుత్, ఇతర కనీస అవసరాలు కల్పించేందుకు మన్ననూర్లో ఐటీడీఏ ఏర్పాటు చేశారు. ఈ ఆఫీస్లో 14 ఏండ్లుగా ఒకే రెగ్యులర్ ఉద్యోగి పని చేస్తున్నారు. మన్ననూర్ ఐటీడీఏ పరిధిలో నాగర్ కర్నూల్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాలను చేర్చారు.
100 గ్రామ పంచాయితీల పరిధిలో 172 చెంచు పెంటలు ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలోనే 80 చెంచు పెంటలు ఉన్నాయి. ఇన్చార్జి పీవో, మరో ముగ్గురు కాంట్రాక్ట్ ఉద్యోగులతో ఐటీడీఏ పని చేస్తోంది. ఆదివాసీల సంక్షేమం కోసం నిధులు కేటాయింపు, వినియోగం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో మన్ననూర్ ఐటీడీఏ అలంకారప్రాయంగా మారింది. వివిధ పథకాల అమలు చేసేందుకు సరైన సిబ్బంది లేకపోవడంతో ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమాచారం అందజేసి మిన్నకుంటున్నారని
అంటున్నారు.
ఏ పథకం అమలు కావట్లే..
చెంచులకు మంజూరైన 890 పక్కా గృహాల వెరిఫికేషన్ కొనసాగుతోంది. పెట్రాల్ చేను, ఎర్రపెంటకు రూ.1.20 కోట్లతో కమ్యూనిటీ హాల్స్ మంజూరయ్యాయి. రూ.6 కోట్లతో మిషన్ భగీరథ కింద పైప్లైన్లు, వాటర్ ట్యాంకుల నిర్మాణం పనులు ప్రారంభం కాలేదు. వైద్య సేవలు అందించేందుకు మంజూరైన ఆరు మొబైల్ మెడికల్ యూనిట్లలో ఒకటి పని చేస్తోంది. 100 కుటుంబాలకో మినీ అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు అమలు కావడం లేదు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర పథకాలను ఇంప్లిమెంట్ చేసి చెంచుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉంది.