ఏపీ సీఎం వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. జగన్ బెయిల్ ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసులను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన రెండు పిటిషన్లను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం ( జనవరి 19) విచారించింది.
జగన్ ఆస్తుల కేసుల కేసులోని బెయిల్ను రద్దు చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కొట్టేయాలని సీఎం జగన్ అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎంపీ రఘురామరాజు అనర్హత పిటిషన్ వేశారని జగన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ కేసులో రాజకీయపరమైన అంశాల జోలికి పోవడం లేదని.. న్యాయపరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటామని సుప్రీంకోర్టు తెలిపింది. వైపీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు దాఖలు చేసిన జగన్ బెయిల్ రద్దు పిటిషన్ ఏప్రిల్ మొదటి వారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
జగన్ కేసులను విచారణకు జాప్యానికి ఎవరు బాధ్యులని వాది, ప్రతివాదులను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. డిశ్చార్జ్ పిటిషన్లను విచారించేందుకు ఎందుకంత సమయం పడుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ జాప్యంలో కానీ... వాయిదాలకు కాని తమకు సంబంధం లేదని సీబీఐ తరపు న్యాయవాది తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. సీబీఐ కు కాకపోతే ఎవరికి సంబంధం ఉంటుందని జస్టిస్ ఖన్నా వ్యాఖ్యానించారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ, జగన్ కుమ్మక్కై ఈ కేసును జాప్యం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ కోర్టుకు తెలిపారు.
హై ప్రొఫైల్ కేసుల విచారణను త్వరిత గతిన పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టు 2023 డిసెంబర్ 15వ తేదీన ఆదేశాలు ఇచ్చిన అంశాన్ని కోర్టు తీసుకొచ్చిన జగన్ తరపు న్యాయవాది కోర్టుకు దృష్టి తెచ్చారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల ప్రకారం జగన్ ఆస్తుల కేసు విచారణ ఎంత త్వరగా తేలుతుందో చూద్దామని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.