- అభిమానులకు హీరో జగపతిబాబు పిలుపు
- బర్త్డే సందర్భంగా ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటన
హైదరాబాద్: సినిమాల్లో హీరో కన్నా రియల్ లైఫ్లో హీరో అవ్వాలనే ఉద్దేశంతో తాను అవయవ దానం చేయడానికి ముందుకొచ్చినట్లు యాక్టర్ జగపతి బాబు చెప్పారు. శనివారం తన 60వ పుట్టిన రోజు సందర్భంగా తన మరణాంతరం అవయవాలను డొనేట్ చేయనున్నట్లు తెలిపారు. శుక్రవారం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అవయవదానం అవగాహన కార్యక్రమంలో ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. సినిమాలో హీరోగా నటించడం కంటే నలుగురికి ఉపయోగపడి నిజ జీవితంలో హీరోలు అవ్వాలని పిలుపునిచ్చారు. అవయవ దానం వల్ల మనం మరణించిన తర్వాత 7, 8 మందికి పునర్జన్మ ఇవ్వొచ్చన్నారు. అవయవ దానం చేసిన వాళ్లకు పద్మశ్రీ, పద్మ భూషణ్ అవార్డులు ప్రకటించాలన్నారు. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయం, కళ్లు, చర్మం, చేతులు.. ఇలా ఎన్నో రకాల అవయవాలను మరణం తర్వాత దానం చేస్తే వేరే వారికి కొత్త జీవితం లభిస్తుందని చెప్పారు. తన అభిమానులంతా అవయవదానం చేయడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
జగపతిబాబు తీసుకున్న ఈ మంచి నిర్ణయంపై పలువురు అభినందనలు తెలుపుతున్నారు. ఈ పుట్టినరోజు వేడకతో మరిన్ని రోజులు సంతోషంగా గడపాలంటూ ట్వీట్లు చేస్తున్నారు. జగపతిబాబు ఇటీవల వచ్చిన అఖండ సినిమాలో నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.