- కేటీఆర్, హరీశ్ చెప్పాలి
హైదరాబాద్, వెలుగు: మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినయా? లేదా? అనేది కేటీఆర్, హరీశ్రావు చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డనా.. బొందల గడ్డనా.. అక్కడ ఏం పీకడానికి పోతున్నారని నల్గొండ సభలో కేసీఆర్అన్నారని, ఇప్పుడు కేటీఆర్ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ సర్కారు అవినీతిని జనానికి చూపించడానికే సీఎం, మంత్రులు మేడిగడ్డకు వెళ్లారన్నారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో తొమ్మిదేండ్లు వేల కోట్లు కమీషన్ల రూపంలో తీసుకున్నారని ఆరోపించారు.
తప్పు చేశారు కాబట్టే ఇరిగేషన్పై చర్చ జరుగుతున్నప్పుడు అసెంబ్లీకి కేసీఆర్రాలేదన్నారు. సీఎం రేవంత్ భాష గురించి మాట్లాడే బీఆర్ఎస్ నాయకులు.. కేసీఆర్ మాటలు గుర్తుకుతెచ్చుకోవాలన్నారు. కేసీఆర్ ఒక్కటంటే మేం వంద అంటామని జగ్గారెడ్డి హెచ్చరించారు. కడియం శ్రీహరి మాటలకు విలువ లేదని, బాల్క సుమన్ చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నాడన్నారు. పొన్నం ప్రభాకర్పై బండి సంజయ్ కామెంట్స్ సరికాదని, వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మెదక్ ఎంపీగా పోటీ చేయాలనుకోవడం లేదని, పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వారు బరిలో ఉంటారన్నారు. టైమ్ బాలేకనే సంగారెడ్డిలో ఓడినట్టు జగ్గారెడ్డి చెప్పారు.