
- రాయ చెరువు, బెజుగామలో విగ్రహాల గుర్తింపు
- చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ వెల్లడి
గజ్వేల్, వెలుగు: సిద్దిపేట జిల్లాలో వేర్వేరు కాలాల కు చెందిన 24వ జైన తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడి రెండు విగ్రహాలు లభించాయి. చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపిన ప్రకారం.. గజ్వేల్ మండలం రాయ చెరువులో తొలి విగ్రహం ఉందని, ధ్యాన ముద్ర మహావీరుడి తలపై ఉష్ణీషం చెక్కి ఉండి, కోలముఖంతో కనిపిస్తుందని పేర్కొన్నారు. ఇది 8,9వ శతాబ్దాలకు చెందిన శిల్పకళా శైలిలో బ్లాక్ కోరైట్ రాయి మీద చెక్కబడిందని తెలిపారు.
రెండోది హనుమాన్ ఆలయం పక్కన చెత్తలో కూరుకుపోయి విరిగి కనిపిస్తుందని, ఇది గుండ్రని ముఖంతో చిన్న ఉష్ణీషంతో 10,11వ శతాబ్దాలకు చెందిన శిల్పకళాశైలిలో చెక్కబడిందని వివరించారు. అదేవిధంగా చారిత్రక గ్రామమైన బెజుగామలో 11వ శతాబ్దానికి(1072) చెందిన కళ్యాణి చాళుక్య పాలకుడు భువనైకమల్ల దేవ కాలంలో పంప పెర్మానడిగల్ బెజుగామ దేవుడికి చేసిన దాన శాసనంతో పాటు, అదే కాలానికి చెందిన మరొక శాసన శకలం ఉన్నాయని చెప్పారు.
బెజుగామ దేవుడు జైనతీర్థంకరుడే అయ్యుండొచ్చని చెప్పారు. చెరువులోని విగ్రహం నీటిలో మునిగిపోక ముందే కట్టమీదకు చేర్చి గ్రామస్తులు తమ గ్రామ చరిత్రను కాపాడుకోవాలని ఆయన సూచించారు.