బాల్క సుమన్ అరాచకాలతో విసిగిపోయాం .. కాంగ్రెస్​లో చేరిన జైపూర్ ఎంపీపీ, ముగ్గురు ఎంపీటీసీలు

బాల్క సుమన్ అరాచకాలతో విసిగిపోయాం .. కాంగ్రెస్​లో చేరిన జైపూర్ ఎంపీపీ, ముగ్గురు ఎంపీటీసీలు

జైపూర్/కోల్​బెల్ట్, వెలుగు: చెన్నూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీకి చెందిన జైపూర్ ఎంపీపీతో పాటు పలువురు ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం రాత్రి జైపూర్ మండలం గంగిపల్లి​లో, సోమవారం మంచిర్యాలలోని తన నివాసంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

 జైపూర్ ఎంపీపీ గోదావరి రమాదేవి లక్ష్మణ్, కుందారం ఎంపీటీసీ సతీశ్, చెట్టుపల్లి ఎంపీటీసీ బోయిన స్వాతి సంపత్, పెగడపల్లి ఎంపీటీసీ నరెడ్ల స్వాతి గోపాల్​రెడ్డి, కుందారం మాజీ సర్పంచి సమ్మయ్య, కాన్కూర్ మాజీ సర్పంచ్ వెంకటేశ్, శివ్వారం సర్పంచ్ ఆవడం గణేశ్, గ్రామశాఖ అధ్యక్షుడు సోల్లురి కనకయ్య చేరారు. గంగిపల్లి వార్డు మెంబర్లు ఎనగందుల జ్యోత్స్న, చరణ్, సుందిల్ల కన్నయ్య, పీఏసీఎస్ డైరెక్టర్ గుండా తిరుపతిరెడ్డి, మాజీ ఉప సర్పంచి తిరుపతి, ఆదర్శ రైతు నరెడ్ల తిరుపతి, లీడర్లు పాలమాకుల శ్రీనివాస్ రెడ్డి, జనగామ శ్రీనివాస్, జనంపల్లి సతీశ్, శనిగారం శ్రీకాంత్​లు కాంగ్రెస్​లో చేరారు. 

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లో చేరిన పలువురు మాట్లాడుతూ బాల్క సుమన్​పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. సుమన్ చేస్తున్న అరాచకాలతో తామంతా విసిగిపోయామన్నారు. ఇంతకాలం పార్టీలో ఉన్నా తమకు సరైన గౌరవం, గుర్తింపు ఇవ్వలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో గంగిపల్లి మాజీ సర్పంచి పాలమాకుల లింగారెడ్డి పాల్గొన్నారు.