
ప్రో కబడ్డీ లీగ్ తొమ్మిదో సీజన్ విజేతగా జైపూర్ పింక్ పాంథర్స్ నిలిచింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో పుణెరి పల్టాన్స్ పై జైపూర్ పింక్ పాంథర్స్ 33-29 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసింది. 13 రైడ్ పాయింట్స్ తో పాటు, 15 టాకిల్ పాయింట్స్ సాధించింది. తొమ్మిదో సీజన్ లోనైనా కప్పు గెలవాలనుకున్న పుణెరి పల్టాన్స్ ఆశలపై జైపూర్ నీళ్ల చల్లింది.
ప్రో కబడ్డీ లీగ్ తొలి సీజన్ లో విజేతగా నిలిచిన జైపూర్, ఎనిమిది సీజన్ల తర్వాత మళ్లీ ఛాంపియన్స్ గా అవతరించింది. ఇక ప్రో కబడ్డీ చరిత్రలో రెండు టైటిల్స్ గెలుచుకున్న రెండో జట్టు జైపూర్ పింక్ పాంథర్స్. మొదటి జట్టు పట్నా పైరేట్స్ అత్యధికంగా మూడు సార్లు ఛాంపియన్స్ గా నిలిచింది.
గేమ్ చేంజర్ ఆఫ్ ది మ్యాచ్ గా వి. అజిత్ కుమార్, పర్ఫెక్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సునిల్ కుమార్ ఎంపికయ్యారు. ఎంవీపీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ అర్జున్ దేశ్వాల్, రైడర్ ఆఫ్ ది సీజన్ భరత్, డిఫెండర్ ఆఫ్ ది సీజన్ అంకుష్, న్యూ యంగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ నరేందర్ అవార్డులు అందుకున్నారు. ఛాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ కి రూ. 3 కోట్లు, రన్నరప్ కి కోటీ 80 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.