విస్తరణ దిశగా జైపూర్​ పవర్​ప్లాంట్

విస్తరణ దిశగా జైపూర్​ పవర్​ప్లాంట్

కోల్​బెల్ట్​/జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్  మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్ లో కొత్తగా 800 మెగావాట్ల మూడో ప్లాంట్​ ఏర్పాటు చేయనున్నారు. ​రాష్ట్ర సర్కారు​ఆమోదం తెలపడంతో ప్లాంట్​ నిర్మాణానికి మరోసారి టెండర్లు పిలవాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఎస్టీపీపీ(సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్) ని విస్తరించి కొత్తగా 800 మెగావాట్ల ప్లాంట్ ను అందుబాటులోకి తీసుకురావాలని ఇటీవల చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి.. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో మూడో ప్లాంట్ ఏర్పాటుకు అడుగు ముందకు పడింది. దీంతో ఈ ప్లాంట్ లో స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు దక్కే అవకాశం ఉంది. 

2015 మార్చిలో మూడో యూనిట్​కు శంకుస్థాపన

జైపూర్  మండలం పెగడపల్లిలో 2011 నవంబర్ 11న  1200 మెగావాట్ల (2×600)​ సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్ (ఎస్టీపీపీ)​ ను ప్రారంభించారు. రెండు యూనిట్ల ద్వారా రోజుకు 28.80 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ ఉత్పత్తి చేస్తున్నారు. రాష్ట్ర విద్యుత్తు అవసరాల్లో సుమారు 15 శాతం ఎస్టీపీపీ ద్వారా తీరుతోంది. విద్యుత్ విక్రయాలతో ఏటా రూ.500 కోట్లకు పైగా ఆదాయాన్ని సింగరేణి ఆర్జిస్తోంది. సింగరేణి సంస్థకు ఇక్కడి వనరులు అనుకూలించడం, అంచనాకు మించి సేకరించిన భూములతో థర్మల్​ విద్యుత్​ కేంద్రాలను విస్తరించేందుకు అదనంగా మరో ప్లాంట్​ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2015 మార్చిలో మూడో యూనిట్‌ పనులకు (అప్పుడు 600 మెగావాట్లకే) అప్పటి సీఎం కేసీఆర్‌  ‌శంకుస్థాపన చేశారు.

రూ.6,800 కోట్ల ఖర్చుతో ఈ ప్లాంట్  నిర్మించాలని నిర్ణయించారు. కానీ నిధుల సమీకరణలో జాప్యం జరిగింది. పర్యావరణానికి మరింత మేలు చేయాలనే ఉద్దేశంతో సబ్‌‌  క్రిటికల్‌ థర్మల్‌ ‌కేంద్రాలకే (కాలుష్యం తగ్గించేవి) కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తోంది. ఈ విధానంలో 600 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి చాన్స్​ లేకపోవడంతో మూడో యూనిట్‌‌ను 600 నుంచి 800 మెగావాట్లకు సింగరేణి పెంచింది. 2019 మార్చి 7న మూడో యూనిట్‌‌ కోసం పొల్యూషన్ బోర్డు విచారణ నిర్వహించింది. సెంట్రల్​ ఎన్విరాన్​మెంట్ ఆఫీసర్లు 2019 డిసెంబర్​18న అనుమతి ఇచ్చారు. 

ఆసక్తి చూపని గత బీఆర్ఎస్​ సర్కారు

సింగరేణి థర్మల్​ పవర్​ ప్లాంట్ విస్తరణలో భాగంగా మూడో యూనిట్​ నిర్మాణంపై  అప్పటి బీఆర్ఎస్​ సర్కారు మొదటి నుంచీ ఆసక్తి చూపలేదు. రెండేళ్ల కింద మూడో ప్లాంట్​ కోసం సింగరేణి సంస్థ రూ.6,800 కోట్ల అంచనాతో టెండర్లు పిలిచింది. టెండర్లలో ఎల్1గా నిలిచిన బీహెచ్ఈఎల్  కంపెనీ కరోనా తర్వాత స్టీల్​ ధరల పెరుగుదలతో అదనంగా 20 శాతం వ్యయాన్ని పెంచగా.. ఎస్టీపీపీకి కన్సల్టెంట్​గా ఉన్న ఎన్టీపీసీ సంస్థ సైతం ఎక్కువ ధర చెల్లించడానికి అంగీకరించలేదు.

దీంతో రెండు సంస్థల మధ్య పలు దఫాలుగా ధరల తగ్గుదలపై చర్చలు జరిగాయి. అయినా బీహెచ్ఈఎల్​ వెనక్కి తగ్గకపోవడంతో సింగరేణి సంస్థ ఆ టెండర్లను రద్దు చేసింది. అప్పటి నుంచి మళ్లీ టెండర్లు పిలువడానికి  గత బీఆర్ఎస్​ సర్కారు​చొరవ తీసుకోలేదు.

సీఎం దృష్టికి తీసుకెళ్లిన వివేక్  వెంకటస్వామి

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పుడు చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్​ వెంకటస్వామి.. జైపూర్ ఎస్టీపీపీని విస్తరించి 800 మెగావాట్ల మూడో యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, ప్లాంట్​ఏర్పాటుతో స్థానికులకు ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు. మూడో ప్లాంట్​ఏర్పాటు ఆవశ్యకతపై ఇటీవలే సీఎం రేవంత్​ రెడ్డిని ఎమ్మెల్యే వివేక్  కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. సింగరేణి ఆఫీసర్లతో నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో ​సర్కారు​మూడో యూనిట్​కు గ్రీన్​ సిగ్నల్​ఇచ్చింది. దీంతో ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి మరోసారి టెండర్లు పిలవనుంది.

80 శాతం ఉద్యోగాలు స్థానికులకే

మూడో యూనిట్  ఏర్పాటు చేస్తే  సింగరేణికి ఏటా రూ.500 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. ప్రస్తుతం ఎస్టీపీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి చొరవతో ఇప్పటికే సింగరేణి ఓసీపీలు, ఎస్టీపీపీలో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మూడో యూనిట్ తో స్థానికులకు 800 నుంచి నుంచి వెయ్యి ఉద్యోగాలు వచ్చే అవకాశం  ఉంది.