కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలె :  జాజుల శ్రీనివాస్ గౌడ్

 కులగణనపై బీజేపీ వైఖరి ఏంటో చెప్పాలె :  జాజుల శ్రీనివాస్ గౌడ్

ముషీరాబాద్,వెలుగు: బీసీ కులగణనపై బీజేపీ తనవైఖరి చెప్పాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బీసీలకు రాముడు ఎంత ముఖ్యమో బీసీ కులగణన కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు. బీసీ కులగణన చేయని బీజేపీకి ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సోమవారం దోమలగూడలోని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర ఆఫీసులో ఫిబ్రవరి 8, 9న బీసీల చలో ఢిల్లీ పోస్టర్ ను  వివిధ బీసీ సంఘాల నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కాంగ్రెస్ తో సహా 22 రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని స్పష్టం చేశాయని పేర్కొన్నారు.  ఇప్పటివరకు బీజేపీ మాత్రం తన వైఖరి వెల్లడించకుండా బీసీలపై వివక్షత చూపిస్తుందని మండిపడ్డారు.

కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ బీసీలకు ఏ ఒక్క మేలు చేయకుండా వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతికత కోల్పోయిందని విమర్శించారు. ఇకనైనా  కులగణనపై తన నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కనకల శ్యాం కురుమ, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, జాజుల లింగం పాల్గొన్నారు.