మూడో టీఎంసీ నీటిని తమ్మిడిహెట్టి నుంచే తరలించాలి

మూడో టీఎంసీ నీటిని తమ్మిడిహెట్టి నుంచే తరలించాలి

వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మూడో టీఎంసీ నీటిని ఎత్తిపోయడం అంటే రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెట్టడమేనని జలసాధన సమితి నాయకుడు నైనాల గోవర్ధన్‌‌ అన్నారు. శనివారం నాగార్జునసాగర్‌‌లో జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆయన ప్రజంటేషన్‌‌ ఇచ్చారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో డిజైన్‌‌ చేసిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్‌‌ ప్రభుత్వం రీ డిజైనింగ్‌‌ చేసి రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టిసిందని అన్నారు. తమ్మిడిహెట్టి వద్ద మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నట్టుగా 148 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మిస్తే అక్కడి నుంచి మైలారం 138 మీటర్ల ఎత్తులో ఉంటుందని, అక్కడి నుంచి ప్రస్తుత సుందిళ్ల బ్యారేజీ 132 మీటర్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. తమ్మిడిహెట్టి నుంచి 16 మీటర్ల వాలు ఉందని, సులభంగా నీళ్లు వచ్చేవని వివరించారు. అక్కడ ఒక లిఫ్టు ఏర్పాటు చేసుకుంటే నీటిని ఎత్తి ఎల్లంపల్లిలో పోసే అవకాశముందని పేర్కొన్నారు. కానీ.. కేసీఆర్‌‌ ప్రభుత్వం తమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని చెప్పి 148 మీటర్ల నుంచి వంద మీటర్ల దిగువకు వెళ్లి ప్రాజెక్టును నిర్మించి ప్రజలపై మోయలేనంత భారం వేసిందని అన్నారు. ‘‘బడ్జెట్‌‌ పెంచడం – కాంట్రాక్టర్లకు పంచడం’’ అన్న ఫార్ములాతోనే కాళేశ్వరం ప్రాజెక్టును రీ డిజైన్‌‌ చేశారని ఆరోపించారు. వంద మీటర్ల ఎత్తు నుంచి 624 మీటర్ల ఎత్తుకు నీళ్లను ఎత్తిపోయడం అంటే ఆ ప్రాజెక్టు ఎకనామికల్‌‌గా వయబుల్‌‌ కాదన్నారు. తమ్మిడిహెట్టి వద్దే ప్రాజెక్టును నిర్మించి ఉంటే భూ సేకరణ, పునరావాసంతో కలిపినా రూ. 5 వేల కోట్లే ఖర్చయ్యేదని ఆయన తెలిపారు.

18 లక్షల ఎకరాలకు మించి నీళ్లివ్వలేరు
కాళేశ్వరం నుంచి గరిష్టంగా 200 టీఎంసీల నీళ్లను ఎత్తినా అందులో 56 టీఎంసీలు హైదరాబాద్‌‌ తాగునీటికి, పారిశ్రామిక అవసరాలకే పోతాయని, మిగిలిన నీళ్లతో 18 లక్షల ఎకరాలకు మించి నీళ్లు ఇవ్వలేరని నైనాల గోవర్ధన్​ చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి తరలించే నీళ్లతో ఒక్క ఎకరం సాగు చేయడానికి  రూ. 1.50 లక్షలు ఖర్చవుతుందని, అంత వ్యయంతో ఏ పంటలు పండిస్తే రైతులకు గిట్టుబాటు అవుతాయో అర్థం చేసుకోవాలని తెలిపారు. పూర్తి గ్రావిటీపై ఆధారపడి ఎకరం భూమిలో పంట సాగు చేసినా రూ. 5 వేలకు మించి గిట్టుబాటయ్యే పరిస్థితి లేదన్నారు. ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించి ఐదేళ్లవుతున్నా ఒక్క ఎకరానికీ నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. రెండు టీఎంసీల నీటిని మేడిగడ్డ నుంచి తరలించడమే పెను భారమంటే మూడో టీఎంసీ నీళ్లు మళ్లించడానికి మరిన్ని లిఫ్టులను ప్రతిపాదిస్తున్నారని, ఇది ఖజానాను మరింత కుంగదీస్తుందన్నారు. ప్రాణహిత– – చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా ప్రతిపాదించిన తమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి నీటిని తరలించాలని సూచించారు. ప్రాణహితలో ప్రతిపాదించిన గ్రావిటీ కాలువలతో ప్రాజెక్టును అనుసంధానం చేయడం ద్వారా వ్యయాన్ని తగ్గించవచ్చన్నారు.