
వరంగల్/ నర్సంపేట, వెలుగు : వరంగల్జిల్లా నర్సంపేట టౌన్మీదుగా వెళ్లే పాకాల జాలుబంధం కాలువ మళ్లీ కబ్జాకు గురైంది. 33 ఫీట్ల కాలువను క్లోజ్చేసి ఓ కబ్జాదారు ప్లాట్లుగా మలిచి దర్జాగా విక్రయిస్తున్నాడు. ఈతతంగం ఆఫీసర్లకు తెలిసినా చూసీచూడనట్లు ఉండడంపై విమర్శలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ఉమ్మడి జిల్లాలోనే పాకాల చెరువు అతిపెద్ద చెరువు. ఈ చెరువు కింద దాదాపు 30 వేల ఎకరాలు ఆయకట్టు సాగువుతోంది. చెరువుకు ఐదు ప్రధాన ఉప కాలువలు ఉన్నాయి.
ఇందులో జాలు బంధం కాలువ 2.14 ఎకరాలను బీఆర్ఎస్కు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి కొన్నేండ్ల నుంచి దర్జాగా కబ్జా చేస్తున్నాడు. ఐబీ పరిధిలోని కాలువ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించి కోట్లు గడించాడు. తాజాగా సర్వాపురం బైపాస్ టూ మహబూబాబాద్ రోడ్కు సమీపంలో జాలు బంధం కాలువను కబ్జా చేసి కాగితాలపై ప్లాట్లు చేసి ఇతరులకు విక్రయించారు. ఈ కబ్జా భూబాగోతాలను ఆఫీసర్లు వెలికి తీస్తే కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు బయటపడే ఛాన్స్ఉంది. కాగా, జాలు బంధం కాలువ కబ్జాలపై వార్తలను రాసిన విలేఖరులను సైతం బెదిరించిన సంఘటనలు ఉన్నాయి.
ఆఫీసర్ల ఉదాసీన వైఖరి..
జాలు బంధం కాలువను కాపాడుతామని చెబుతూనే ఇరిగేషన్ఆఫీసర్లు ఉదాసీనంగా వ్యవహరించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కబ్జాను అడ్డుకుని కాలువను పరిరక్షించాలని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇరిగేషన్ ఆఫీసర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. మొక్కుబడిగా ఆఫీసర్లు ఫీల్డ్ విజిట్చేసి సర్వేయర్ రాలేదని దాటవేశారు. ఎమ్మెల్యే ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోలేదు.
ఈక్రమంలో కబ్జాదారు రంగ ప్రవేశం చేసి జాలు బంధం కాలువను మార్కెట్లో గజానికి రూ.5 వేల చొప్పున విక్రయించడంతో ఎమ్మెల్యే ఆదేశాలు బుట్టదాఖలు అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ విషయమై ఈఈ సుదర్శన్ను వివరణ కోరగా, జాలు బంధం కాలువ భూములను కాపాడుతామన్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని, సర్వేయర్లు అందుబాటులో లేకపోవడంతో ఆలస్యం అవుతోందన్నారు. !