
రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. జన శంఖారావం పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు పార్టీ కార్యవర్గం పత్రికా ప్రకటన విడుదల చేసింది. వెనుకబడ్డ వర్గాల ఆత్మాభిమానం, అభివృద్ధి, ఆశయాల సాధన కోసం తాము కొత్త ఎజెండాతో వస్తున్నామని పార్టీ అధ్యక్షుడు పర్దిపూర్ నర్సింహ తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 72 ఏళ్లు గడిచినా వెనుకబడ్డ వర్గాల వారు రాజ్యాధికారం చేపట్టలేకపోతున్నారని, నామమాత్రపు పదవులే దక్కుతున్నాయని అన్నారు. విద్య, ఉద్యోగ, రాజకీయ పరంగా బడుగు వర్గాలను ఇంకా వెనుకబడే ఉన్నాయన్నారు. దేశ ఉన్నతిని కోరుకొని ముందడుగు వేసే వెనుకబడ్డ పౌరులకు జన శంఖారావం పార్టీ వేదికగా నిలుస్తుందని చెప్పారు నర్సింహ.
ఈ సందర్భంగా పార్టీ కార్యవర్గాన్ని కూడా ప్రకటించారు అధ్యక్షుడు నర్సింహ. పార్టీ ఉపాధ్యకుడిగా వినోద్ ఖన్నా యాదవ్, ప్రధాన కార్యదర్శిగా కంటేకర్ రాంజీ, కోశాధికారిగా బి.నాగరాజు గుప్తా, ఉమ్మడి కార్యదర్శిగా ఎ.గణేష్ రెడ్డి, నిర్వహరణ కార్యదర్శులుగా జి.సాయి కిషోర్, ఎం.రవి ముదిరాజ్, కార్యనిర్వాహకులుగా జె.అవినాష్, ఎస్.శ్రీశైలం యాదవ్ పేర్లను ప్రకటించారు.
గతంలో నర్సింహ ప్రజారాజ్యం , జనసేన పార్టీ ప్రధాన నేతల్లో ఒకరిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్కి సన్నిహితుడిగా మెలిగేవారని ఆ పార్టీలో పేరుంది. తెలంగాణలో వెనుక బడ్డ వర్గాల ఉనికిని చాటడానికే పార్టీ స్థాపించానని ఆయన చెబుతున్నారు.