జనగామ, వెలుగు: వాన పడితే సర్కారు బిల్డింగ్ల పరిస్థితి ఆగమాగం అవుతోంది. శుక్రవారం కురిసిన భారీ వానకు జనగామ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్ ఉరుస్తోంది. వారం క్రితం కురిసిన ముసురు వానలకు పలుచోట్ల గోడలు చిమ్మటియ్యడంతోపాటు అక్కడక్కడ చుక్కలు చుక్కలుగా ఉరిసింది. తాజాగా గట్టి వాన పడడంతో ఏకంగా గోడల జాయింట్ల వద్ద ధారలుగా నీళ్లు బయటకు వస్తున్నాయి. పార్కింగ్ సెల్లార్లో పెద్దఎత్తున నీళ్లు నిలవడంతో పారిశుద్ధ్య కార్మికులు వాటిని బయటకు పంపలేక అవస్థలు పడ్డారు. పొద్దంతా చీపుర్లతో ఊడుస్తూ అదే పనిలో ఉండిపోయారు. ఇక జిల్లా పంచాయతీ ఆఫీస్, లేబర్ఆఫీస్, ఖజానా ఆఫీస్, ఇంటర్విద్యాశాఖ, డీఎం ఆఫీస్లతో పాటు పలుచోట్ల గోడలు చిమ్మటిస్తున్నాయి.
కుంట ఎఫ్టీఎల్లో కట్టడంతో..
జనగామ జిల్లా రవాణా శాఖ ఆఫీస్వానలకు నీట మునిగింది. 2014 లో అప్పటి ఆఫీసర్లు, లీడర్లు రియల్ వ్యాపారుల ఒత్తిడికి తలొగ్గి ఆర్టీఓ ఆఫీస్ బిల్డింగ్ను వెంచర్లో నిర్మించేందుకు అనుమతులు ఇచ్చారు. ఇది జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలోని పెంబర్తి శివారు కంబాల కుంట ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటుంది. రూల్స్కు విరుద్ధంగా వెంచర్కు పర్మిషన్లు ఇవ్వడమే కాకుండా ఈజీగా అందులోని ప్లాట్లను అమ్ముకోవాలనే కుయుక్తులకు అప్పటి పాలకులు, ఆఫీసర్లు తలూపారు. ఫ్రీగా ఆర్టీఏ ఆఫీస్కు స్థలం వస్తోందంటూ కుంట అని చూడకుండా కండ్లు మూసుకుని సుమారు రూ. 70 లక్షలతో నిర్మాణం మొదలు పెట్టారు. రెండేండ్ల క్రితం బిల్డింగ్ నిర్మాణం పూర్తయినా వానాకాలం సీజన్లో అది మునిగిపోతుందన్న భయంతో ఆర్టీఓ ఆఫీస్ను అక్కడికి మార్చేందుకు వెనకడుగు వేశారు. ఈ మధ్య కాలంలో ఇక్కడ జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేసిన రమేశ్రాథోడ్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సింగం శ్రీనివాసరావు బాధ్యతలు చేపట్టారు. మూడు నెలల క్రితం కొత్త బిల్డింగ్లోకి ఆఫీస్ను మార్చారు. వానలతో ఆఫీస్చుట్టూ నీళ్లు నిండాయి. ఈ నీళ్లు ఇప్పట్లో ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. లైసెన్స్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారికి ఏ విధంగా సేవలందిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
టీఆర్ఎస్, బీజేపీ వాగ్వాదం
ఎఫ్టీఎల్పరిధిలో ఆర్టీఓ ఆఫీస్నిర్మాణం చేపట్టడంతో ఇబ్బందులు తలెత్తాయని బీజేపీ టౌన్ ప్రెసిడెంట్వారణాసి పవన్శర్మ ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి నిర్లక్ష్యం కారణంగా పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ లీడర్లు నిమ్మతి మహేందర్రెడ్డి, రాజు తదితరులు బీజేపీ లీడర్లతో వాగ్వాదానికి దిగారు. ఒకరిపై ఒకరు మాటలతో విరుచుకుపడ్డారు. అదే సమయంలో టీడీపీ లీడర్లు అక్కడికి చేరుకుని నిరసన తెలిపారు.