ఏసీబీకి చిక్కిన జనగామ డీఎంహెచ్ఓ

ఏసీబీకి చిక్కిన జనగామ డీఎంహెచ్ఓ

జనగామ, వెలుగు: ఫార్మసిస్ట్ నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటూ జనగామ డీఎంహెచ్ఓ ఏసీబీకి చిక్కాడు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఏసీబీ డీఎస్పీ పి.సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం ఓబుల్ కేశవాపూర్​పీహెచ్​సీలో 2021 నుంచి స్రవంతి అనే ఔట్​సోర్సింగ్​ఎంప్లాయ్​పనిచేస్తోంది. గతేడాది అక్టోబర్​లో జనగామ డీఎంహెచ్ఓ ప్రశాంత్​ఆమెను తొలగించారు. దీంతో స్రవంతి డీఎంహెచ్ఓను కలిసి తనను తీసేయొద్దని కోరింది. రెగ్యులర్​ఫార్మసిస్ట్​వచ్చినందునే, ఆమెను తొలగించినట్లు అధికారులు చెప్పి పంపించారు. అదే రోజున సాయంత్రం డీఎంహెచ్ఓ ఆఫీస్​నుంచి జూనియర్ అసిస్టెంట్ అజార్ స్రవంతికి ఫోన్​చేశాడు. ‘డీఎంహెచ్ఓ సార్​మిమ్మల్ని ఆఫీసుకు రమ్మంటున్నారు’ అని చెప్పాడు. వెంటనే అక్కడికి చేరుకున్న స్రవంతితో ‘రూ.లక్ష లంచం ఇస్తే.. సార్​నీ ఉద్యోగాన్ని రెగ్యులర్​చేస్తారు’ అని అజార్ చెప్పాడు. 

దీంతో స్రవంతి డీఎంహెచ్ఓ ప్రశాంత్​ను కలిసి అంత ఇచ్చుకోలేనని ప్రాధేయపడింది. ‘అజార్ చెప్పినట్లు చేస్తే నీ పని అయిపోతుంది’ అని డీహెచ్ఓ చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెళ్లిపోయింది. తర్వాత మూడు నెలలపాటు డీఎంహెచ్ఓ ఆఫీసు చుట్టూ తిరిగింది. చివరికి వారం కింద జూనియర్ అసిస్టెంట్ అజార్​ను కలిసి స్రవంతి రూ.50 వేలు ఇచ్చింది. అయినా పోస్టింగ్​ ఆర్డర్లు రాకపోవడంతో మరో రూ.50 వేలు ఇస్తానని చెప్పి, ఏసీబీని ఆశ్రయించింది. గురువారం అజార్​కు రూ.50వేలు ఇచ్చింది. తర్వాత డీఎంహెచ్ఓ ప్రశాంత్​ను కలిసి విషయం చెప్పింది. జాబ్​తోపాటు ఏరియర్స్​ఇప్పిస్తానని చెబుతుండగా, ఏసీబీ ఆఫీసర్లు రైడ్​చేసి పట్టుకున్నారు. నిందితులిద్దరినీ నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ వెంట సీఐలు శ్యామ్, శ్రీనివాస్, రవి ఉన్నారు. నెలన్నర కింద లంచం తీసుకొంటూ జనగామ మున్సిపల్​కమిషనర్​రజిత ఏసీబీకి చిక్కగా, తాజాగా డీఎంహెచ్ఓ పట్టుబడడం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.